
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. ఇప్పటికే ఆయనను తాడిపత్రిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న కూటమి నేతలు.. తాజాగా ఆయన ఇంటిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పెద్దారెడ్డి ఇంటి వద్ద తాజాగా మున్సిపల్ శాఖ అధికారులు కొలతలు తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
వివరాల ప్రకారం.. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి కక్ష సాధింపు పీక్ స్టేజ్కు చేరుకుంది. పెద్దారెడ్డిని టార్గెట్ చేసి అధికారులు, టీడీపీ నేతలు రాజీకీయంగా వేధింపులకు గురిచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక టీడీపీ నేతలు, పోలీసులు.. ఇప్పటికీ ఆయనను తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వడం లేదు. ఇక, తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ అధికారులు తనిఖీలు అనుమానాలకు తావిస్తున్నాయి.
ఈరోజు పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన అధికారులు.. అక్కడ టేపుతో కొలతలు తీసుకున్నారు. ఇంటి ముందు, పరిసరాల్లో కొలతలు చేపట్టారు. అయితే, మున్సిపల్ స్థలం ఆక్రమించారనే ఫిర్యాదు మేరకు తాము కొలతలు చేపట్టినట్టు అధికారులు చెప్పారు. అయితే, వారి మాటలకు చేతలకు పొంతన కనిపించలేదు. దీంతో, స్థానిక వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు మాత్రం పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు.
