
విద్యార్థుల భవిష్యత్తో కూటమి ప్రభుత్వం చెలగాటం
పేద దళిత, గిరిజన బిడ్డల చదువుకు కిరాయి భారమట
రాష్ట్రంలోనే ఏకైక బాలికల ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్ అకాడమీ బంద్
ఈడుపుగల్లులోని అంబేడ్కర్ గురుకులం మూత
రోడ్డున పడ్డ 280 మంది దళిత, గిరిజన విద్యార్థినులు
ఇంటర్ సెకండ్ ఇయర్ చదువు ఎలాగంటూ ఆవేదన
తాడేపల్లిలోని ఎస్సీ గురుకుల రాష్ట్ర కార్యాలయం వద్ద విద్యార్థులు ఆవేదన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోనే ఏకైక బాలికల ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్ అకాడమీని కూటమి ప్రభుత్వం అర్థంతరంగా మూసేసింది. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీల బిడ్డలు చదివే గురుకులానికి అద్దె భారమైందని సాకులు చెబుతోంది. ఈడుపుగల్లు అకాడమీ బంద్తో 280 మంది భవితవ్యం రోడ్డున పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఇక్కడ చదివిన తాము.. రెండో ఏడాది ఎక్కడకు వెళ్లాలంటూ విద్యార్థినులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్ సీట్లు సాధించాలనే లక్ష్యంతో తామంతా చేరితే కేవలం అద్దె చెల్లించలేమంటూ.. ప్రభుత్వం మాట మాత్రమైనా చెప్పకుండా కృష్ణా జిల్లా ఈడుపుగల్లు అకాడమీని మూసేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తాడేపల్లిలోని ఏపీ సాంఘిక సంక్షేమ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు.
బాలికలకు ఉన్న ఏకైక అకాడమీని మూసేసి వేరే గురుకులంలో చేరాలని అధికారులు ఒత్తిడి చేయడం అన్యాయమని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పలు శాఖల ప్రధాన కార్యాలయాల నుంచి క్షేత్రస్థాయిలో అనేక కార్యాలయాలను అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం ఏకైక మెడికల్ అకాడవీుకి అద్దె చెల్లించలేమని చేతులెత్తయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమేనని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఏకైక బాలికల అకాడమీ..
కర్నూలు జిల్లా చిన్నటేకూరు, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులో బాలుర కోసం అకాడమీలు నిర్వహిస్తున్నారు. ఈడుపుగల్లులోని అకాడమీ బాలికల కోసం ప్రత్యేకించినది. ప్రవేశపరీక్ష నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన సీట్లు ఇస్తున్నారు. 26 జిల్లాల దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలు ఇక్కడ చేరి చదువుకుంటున్నారు. అయితే, దీన్ని మూసివేయాలనే ముందస్తు ప్రణాళికతో ఉన్న ప్రభుత్వం ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లుసైతం నిలిపివేసింది.
శభాష్ అన్పించుకుంటున్న విద్యార్థినులు
ఈడుపుగల్లు అకాడమీ విద్యార్థినులు కొన్నేళ్లుగా ఐఐటీ, ఎన్ఐటీ, ఎంబీబీఎస్, వెటర్నరీ, అగ్రి, ఈఏపీసెట్, జేఎన్టీయూల్లో సీట్లు సాధించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అద్భుతంగా రాణించారు. 2021 నుంచి ఏటా రాష్ట్ర స్థాయిలో పలు విభాగాల్లో ఎన్నికవుతూ వస్తున్నారు.
కేఎల్వైఈఎస్–యూఎస్ ప్రోగ్రాంలో ఏడాది పాటు అమెరికాలో ఉండి విద్యను అభ్యసించే అవకాశాన్ని అందుకున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వహించిన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన ఈడుపుగల్లు విద్యార్థులు ఏకంగా రూ.3.50 లక్షల నగదు బహుమతులు పొందడం విశేషం.
అకాడమీని తీసేస్తే పిల్లల భవిష్యత్ ఏంటి?
మా అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తయింది. రెండో సంవత్సరానికి వచ్చేసరికి అకాడమీ తీసేస్తే ఆమె భవిష్యత్ ఏమిటి? పిల్లలను కృష్ణా జిల్లా కుంటముక్కల గురుకులానికి తరలిస్తామని చెబుతున్నారు. విజయవాడకు 50 కిలోమీటర్లకు పైగా దూరం ఉండే అకాడవిుకీ వెళ్లాలంటే రెండు గంటలు పడుతుంది. అక్కడ పెచ్చులూడిపోయిన భవనంలో కనీస సౌకర్యాలు లేవు. అన్నీ వదిలేసి అంత దూరం నుంచి తీసుకొచ్చి మా పిల్లల్ని ఈడుపుగల్లు అకాడమీలో చేర్పిస్తే ఇంత దుర్మార్గంగా చేస్తే ఎలా? –ఇందిర, విద్యార్థిని తల్లి, నల్లజర్ల, తూర్పుగోదావరి జిల్లా
వైఎస్ జగన్ కొనసాగించినా.. లోకేశ్ తీసేస్తున్నారు
మా పాప శ్రీవల్లిని ఎంతో ఆశతో ఈడుపుగల్లు అకాడమీలో చేర్పించాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు 426 సాధించింది. మరింత ఉన్నత చదువులకు వెళ్తుందనుకుంటే ఇంతలోనే అకాడమీని మూసేసి అన్యాయం చేశారు. 2017లో చంద్రబాబు స్థాపించిన ఈ అకాడమీని మాజీ సీఎం వైఎస్ జగన్ ఎంతో శ్రద్ధతో కొనసాగించారు.
ఇప్పుడు చంద్రబాబు కుమారుడు, విద్యా శాఖ మంత్రిగా ఉన్న లోకేశ్ తీసేయాలని చూడడం దుర్మార్గం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రూ.20 వేల కోట్లకు పైగా కేంద్ర నిధులు వస్తున్నాయి. కనీసం అద్దె కట్టి ఒక అకాడమీని ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం కొనసాగించలేరా? –జెల్లా శ్రీనివాసులు, బేతంచర్ల, నంద్యాల జిల్లా
ప్రభుత్వానికి అద్దె భారమవుతోందని..
అకాడమీ భవనానికి అద్దె భారంగా మారిందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాన్ని మూసివేస్తే అద్దె భారం తగ్గుతుంది. అందుకే విద్యార్థులను వేరొక గురుకులానికి తరలించేలా ఒప్పిస్తున్నాం. ఉన్నవారిని విభజించి గురుకులాల్లో సర్దుబాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం –ప్రసన్న వెంకటేశ్, కార్యదర్శి, ఏపీ ఎస్సీ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సంస్థ