
- విస్తుగొలుపుతున్న తల్లికి వందనం లబ్దిదారుల జాబితా
- ఒకే ఆధార్.. పదులు, వందల సంఖ్యలో లబ్దిదారులు
- కర్నూలు జిల్లా హాలహర్విలో గాదిలింగప్పకు 94 మంది పిల్లలట!
- ఇతనికి రూ.12.22 లక్షలు జమ కానున్నట్లు మెసేజ్
- నంద్యాల జిల్లాలో బెస్త సుజాత పేరిట 37 మంది పిల్లలు రిజిస్టర్
- ఈ రెండు జిల్లాల్లోనే వందల సంఖ్యలో అవకతవకలు
- రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇదే పంథా
- జాబితాలను డీఈవోలకు పంపి విచారిస్తున్న ప్రభుత్వం
- ఇవన్నీ సరిచేస్తే భారీగా తగ్గనున్న లబ్దిదారుల సంఖ్య
సాక్షి ప్రతినిధి కర్నూలు : నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని పలు ఊళ్లలో ‘తల్లికి వందనం’ అర్హుల జాబితాలు విస్తుగొలుపుతున్నాయి. ఒకే తల్లి పేరుతో, ఒకే ఆధార్ నంబర్తో పదుల సంఖ్యలో పిల్లలు ఉన్నట్లు జాబితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి తప్పిదాలా.. లేక టీడీపీ కూటమి నేతల స్కామ్లా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఒకటి, రెండు చోట్ల కాకుండా భారీ సంఖ్యలో కనిపిస్తుండటం చర్చనీయాంశమైంది. ‘తల్లికి వందనం’ పథకం జీవో జూన్ 12వ తేదీన విడుదలైంది. అదే రోజు రాష్ట్రంలోని సచివాలయాల పరిధిలో పథకానికి అర్హత సాధించిన వారి జాబితాలను ప్రచురించారు.
ఈ జాబితాలో తమ పేర్లు ఉన్నాయా? లేదా? అని లబ్ధిదారులు పరిశీలించారు. ఇందులో గతంలో ‘అమ్మ ఒడి’కి అర్హత సాధించి ఇప్పుడు ‘తల్లికి వందనం’ జాబితాలో పేర్లు లేని వారు వేల సంఖ్యలో ఉన్నారు. అలాగే ఒకే తల్లి పేరుతో, ఒకే ఆధార్ నెంబర్తో 10కి మించి పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. నిజానికి ఆ సచివాలయాల పరిధిలో ఏ తల్లికి ఎంత మంది పిల్లలు ఉన్నారనేది తక్కిన వారికి స్పష్టంగా తెలుసు. జాబితా తప్పుగా ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా మిత్రులకు పంపారు. దీంతో విషయం విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి వింతలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఆ జాబితాలన్నింటినీ ఆయా జిల్లాల డీఈఓలకు పంపారు.
ఇలా కర్నూలు జిల్లాలో 20,806 మంది విద్యార్థుల పేర్లు తప్పుగా ఉన్నట్లు విద్యాశాఖ కమిషనరేట్ నుంచి డీఈఓకు జాబితా వచ్చినట్లు తెలిసింది. ఇందులో ఇప్పటి వరకు (14వ తేదీ సాయంత్రం) 14 వేల మంది విద్యార్థుల పేర్లు సరి చేసినట్లు తెలిసింది. నంద్యాల జిల్లాలో 8 వేల పేర్లు అధికారుల నుంచి వస్తే 6,600 పేర్లు పరిశీలించినట్లు సమాచారం. ఇందులో ఎక్కువగా ఆధార్ తప్పుగా ఉండటం, ఒకే తల్లి.. ఒకే ఆధార్ కార్డుపై ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఎక్కడో ఏదో జరిగింది..!
కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనే 28,806 పేర్లు తప్పుగా ఉన్నట్లు రాష్ట్ర విద్యా శాఖ గుర్తించి పరిశీలనకు జాబితాను డీఈఓలకు పంపించిందంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లక్షల సంఖ్యలో తప్పిదాలు జరిగి ఉంటాయనేది స్పష్టమవుతోంది. పైగా యూడైస్ (యూనిపైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్)లో రాష్ట్ర వ్యాప్తంగా 87,41,885 మంది పిల్లలు ఉన్నట్లు ఉంది. ఇది ఆయా జిల్లా కలెక్టర్లు ధ్రువీకరించిన పంపిన జాబితా. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని వెబ్సైట్. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 67 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే తల్లికి వందనం అమలు చేస్తోంది.
కాగా.. ఒకే తల్లి, ఒకే ఆధార్ కార్డుపై పదుల సంఖ్యలో పిల్లలు ఎలా నమోదయ్యారనే విషయమై అధికారులు నోరు మెదపడం లేదు. ఒకవేళ ఇది తప్పిదమే అయితే ఏ విధంగా జరిగిందో స్పష్టత ఇవ్వాలి. ఇప్పటిదాకా అదీ లేదు. దీన్నిబట్టి ఎక్కడికక్కడ ఏదో గోల్మాల్ జరిగి ఉంటుందని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ‘అమ్మ ఒడి’కి అర్హత సాధించి ఇప్పుడు జాబితాలో లేని నిజమైన అర్హులు వేదన పడుతుంటే, మరో వైపు ఒకే పేరుతో 40 మంది, 90 మందికి డబ్బులు జమ కానున్నట్లు జాబితాలు ప్రకటించడం పథకం అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తోంది. ఈ లెక్కలు సరిచేస్తే అర్హుల సంఖ్య ఇంకా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
ప్రభుత్వ బాధ్యత ఏదీ?
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ‘అమ్మఒడి’ పథకమే ‘తల్లికి వందనం’. ఇలా పేరు మార్చి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏటా అమ్మఒడి పథకం కోసం లబ్దిదారుల డేటాను పాఠశాల యాజమాన్యంతో పాటు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఒకటికి రెండుసార్లు పరిశీలించి అంతా సరిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే పథకాన్ని అమలు చేసేవారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి జాబితాలో ఒక్కసారి కూడా తప్పులు దొర్లలేదు.
కానీ కూటమి ప్రభుత్వంలో ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోనే ఇంత భారీ స్థాయిలో తప్పిదాలు/అవకతవకలు చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. కాగా, డోన్ ఘటనపై నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని ‘సాక్షి’ సంప్రదించగా విచారిస్తున్నామని, వారి ఖాతాలో ఇంకా డబ్బులు పడలేదని చెప్పారు. అనాథలు ఎవరైనా ఉంటే ఇతర తల్లుల పేర్లు పిల్లలకు లింక్ చేసే అవకాశం ఉందని చెప్పారు. కర్నూలు జిల్లాలోని ఘటనలపై కలెక్టర్ రంజిత్బాషాను వివరణ కోరగా.. తన దృష్టికి రాలేదని, డీఈఓకు చెప్పి విచారణ చేయిస్తామన్నారు.
నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన సచివాలయం నంబర్–4 పరిధిలో తల్లికి వందనం అర్హుల జాబితా విస్తుగొలుపుతోంది. ఇందులో బెస్త సుజాత అనే మహిళ పేరుతో 37 మంది పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఒకే ఆధార్ కార్డు పేరుతో వీరంతా సుజాత పిల్లలుగా రికార్డులోకి ఎక్కారు. అయితే పిల్లలు చదివే స్కూలు కోడ్ మాత్రం వేర్వేరుగా ఉంది.
37 మందికి ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున రూ.4.81 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ కానుంది. నిజానికి సుజాత పిల్లలు కర్నూలులోని ఓ ప్రైవేటు స్కూలులో చదువుతున్నారు. ఈమె భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పథకానికి అర్హతే లేదు. అయితే బెస్త సుజాత పేరుతో వేరుగా రేషన్కార్డు ఉన్నట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హాలహర్వి జెడ్పీ పాఠశాలలో బింగి గాదిలింగప్ప పిల్లలు చదువుతున్నారు. ఇతని భార్య పేరు హంపమ్మ. ఈయన ఆధార్ నంబర్ 244429359357పై 94 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు ఖాతాలో జమ అవుతున్నట్లు జాబితాలో ఉంది.
94 మందికి రూ.12.22 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ కానుంది. ఇతను పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. వ్యవసాయ పనులకు వెళతాడు. భార్య ఉండగా లింగప్ప ఆధార్ నంబర్ ఎందుకు లింక్ చేయాల్సి వచ్చిందో అధికారులకే తెలియాలి.

తల్లికి వందనం పథకం కింద బింగి గాది లింగప్పకు 94మంది సంతానానికిగానూ రూ.12,22,000 జమ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం పంపిన సమాచారం