
తిరుమల: కొత్త ఏడాది జనవరికి సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్ల జనవరి కోటాను 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎల్రక్టానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
23న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 23న టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తుంది. 24న శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తుంది.
ఇక 25న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు గదుల కోటాను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనున్నది. https:// ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.