కొడుకూ కోడలే తరిమేశారయ్యా!

Son Leaves Mother on Road in Tirupati - Sakshi

‘పండుటాకు’కు ఎంతకష్టం..దుఃఖం

స్పందించిన అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డి

వృద్ధురాలికి ‘అమ్మ ఒడి’ ఆశ్రయం

తిరుపతి క్రైం : జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులకు ఏ లోటూ రాకుండా చూసుకోవడం బిడ్డల బాధ్యత. అయితే దీనిని గాలికొదిలేస్తున్న వారి సంఖ్య కొన్నేళ్ల కాలంలో పెరిగిపోతోంది. అసలే కరోనా ప్రజలను భయపెడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఓ వృద్ధురాలిని నిర్దయగా వదిలించుకున్నారు. వివరాలు.. 40 రోజులుగా రుయా ఆస్పత్రిలో ఆవరణలో∙ఉంటున్న ఓ వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోందని అర్బన్‌ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి దృష్టికి వచ్చింది. ఆయన ఆదేశాలతో అలిపిరి సీఐ సుబ్బారెడ్డి మంగళవారం అక్కడికి చేరుకున్నారు.

వృద్ధురాలి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన పేరు కాంతమ్మ అని, కొడుకులు, కోడళ్లు తరిమేయడంతో అనాథగా అయ్యానని కన్నీటిపర్యంతమైంది. దీంతో సీఐ ‘అమ్మ ఒడి’ వ్యవస్థాపకులు పద్మనాభనాయుడుతో మాట్లాడారు. వృద్ధురానికి ఆశ్రమానికి తరలించారు. అనంతరం ఆమె గురించి ‘సాక్షి’ పద్మనాభనాయుడితో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె తన పేరు మాత్రమే చెబుతోందని, కొడుకులు ఇద్దరు..కాదు..ఒకడే అని, తనది వల్లివేడు (పాకాల మండలం),  రేణిగుంట, పుత్తూరు అని పొంతన లేకుండా చెబు తోందని ఆశ్రమ నిర్వాహకుడు చెప్పారు. కాలి బొటనవేలికి పెద్ద పుండు అయ్యిందని, ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని, ఆమె పూర్తిగా కోలుకున్నాక ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుంటామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top