
కొవ్వూరు(తూర్పు గోదావరి): మాజీ మంత్రి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ ఇంట్లో శనివారం దొంగలు పడ్డారు. వేసవి సెలవుల నేపథ్యంలో రెండు రోజుల కిత్రం జవహర్ తన స్వగ్రామం తిరువూరు వెళ్లారు. శనివారం మొక్కలకు నీళ్లు పోయడానికి వెళ్లిన అనుచరుడు ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లో సామాన్లు చిందరవందరగా ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ జి.దేవకుమార్, సీఐ పి.విశ్వం సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ తీరును పరిశీలించారు.
జవహర్ కుటుంబ సభ్యులు వస్తే తప్ప చోరీ సొత్తు వివరాలు తెలియవని వారు తెలిపారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. ఈ చోరీపై ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ తెలిపారు. జవహర్కు సమాచారం అందించామని, ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కొవ్వూరు వస్తున్నట్లు సీఐ తెలిపారు.