కేజీబీవీల్లో 958 టీచింగ్‌ పోస్టుల భర్తీ

Replacement of 958 teaching posts in KGBV - Sakshi

నోటిఫికేషన్‌ జారీ చేసిన సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

అర్హతలు, మెరిట్‌ ప్రాతిపదికన నియామకం

రేపటి నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

11న ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా

18న కౌన్సెలింగ్, పోస్టింగ్‌ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అన్ని కేజీబీవీల్లో 958 ఖాళీ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.వెట్రిసెల్వి శుక్రవారం అన్ని జిల్లాల విద్యాధికారులను ఆదేశిస్తూ షెడ్యూల్‌ విడుదల చేశారు. పోస్టులను భర్తీ చేసి ఈనెల 20వ తేదీలోగా నివేదికలు పంపాలని పేర్కొన్నారు. అభ్యర్ధుల అర్హతలు, మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వయోపరిమితి 42 ఏళ్లుగా నిర్దేశించారు.

రిజర్వుడ్‌ అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి 47 ఏళ్ల వరకు ఉంటుంది. కేజీబీవీల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగుతున్నందున తప్పనిసరిగా అదే మాధ్యమంలో బోధన సామర్థ్యం కలిగి ఉండాలి. అలా లేనివారి నియామకాలను రద్దు చేసి తొలగిస్తారు. టీచింగ్‌ సిబ్బంది నియామక ఉత్తర్వులను జిల్లా స్థాయిలో, ప్రిన్సిపాళ్ల నియామక ఉత్తర్వులు రాష్ట్ర స్థాయిలో ఇస్తారు. అభ్యర్ధుల విద్యార్హతలు, సాధించిన మార్కులు, అనుభవం, రిజర్వేషన్ల వారీగా ప్రొవిజనల్‌ జాబితాను ఆయా జిల్లాల అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, డీఈవోలు విడుదల చేస్తారు. అభ్యంతరాలను స్వీకరించి తుది మెరిట్‌ జాబితా వెలువరిస్తారు. 

విద్యార్హతలు, నెలవారీ వేతనాలు ఇలా
ప్రిన్సిపాల్‌ (స్పెషలాఫీసర్‌): యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, బీఈడీ, ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్‌ కాలేజీ, హైస్కూళ్లలో ప్రిన్సిపాల్‌గా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.27,755
సీఆర్టీ:  యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, మెథడాలజీలో బీఈడీతో పాటు ఏపీటెట్‌ లేదా తత్సమాన పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.  ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్‌ కాలేజీ, హైస్కూళ్లలో ప్రిన్సిపాల్‌గా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.21,755
పీఈటీ: 50 శాతం కనీస మార్కులతో ఇంటర్మీడియెట్‌ లేదా డిగ్రీ ఉత్తీర్ణత. యూజీడీపీఈడీ లేదా బీపీఈడీ/ఎంపీఈడీ శిక్షణతో పాటు ఏపీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి. రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి. వేతనం రూ.21,755
పీజీటీ:  యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, మెథడాలజీలో బీఈడీ అర్హత సాధించి ఉండాలి.  ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్‌ కాలేజీ, హైస్కూళ్లలో పీజీటీగా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.12,000
పీజీటీ వొకేషనల్‌: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమో చేసి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్‌ కాలేజీ, హైస్కూళ్లలో పీజీటీ వొకేషనల్‌ పోస్టులో రెండేళ్ల అనుభవం. వేతనం రూ.12000. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top