నష్టాల సాగు.. రైతుకు లేదు బాగు | Reduced Area Under Cultivation In 2024-25 And Yields Have Also Fallen Significantly | Sakshi
Sakshi News home page

నష్టాల సాగు.. రైతుకు లేదు బాగు

Jun 20 2025 6:10 AM | Updated on Jun 20 2025 9:01 AM

Reduced area under cultivation in 2024-25, lower yields

2024–25లో తగ్గిన సాగు విస్తీర్ణం దిగజారిన దిగుబడులు

సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు 

సాగైన విస్తీర్ణం 70.15 లక్షల ఎకరాలు 

దిగుబడుల లక్ష్యం 167.15 లక్షల టన్నులు 

తుది దిగుబడులు 154.43 లక్షల టన్నులు 

అయినా వృద్ధి రేటు పెరిగిందంటూ డాంబికాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడులు సైతం గణనీయంగా పడిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024–25 వ్యవసాయ సీజన్‌లో ఖరీఫ్, రబీల్లో సాధారణం కంటే 25.72 లక్షల ఎకరాల్లో పంటలు సాగవలేదు. దాదాపు 7 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడలేదు. 

ఖరీఫ్‌–2024, రబీ 2024–25 రెండు సీజన్లలో కలిపి సాగు లక్ష్యం 1.51 కోట్ల ఎకరాలు కాగా.. 1.24 కోట్ల ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలు వేశారు. దాదాపు 27 లక్షల ఎకరాల్లో పంటలు సాగవని పరిస్థితి. దిగుబడుల పరంగా చూస్తే ఒక్క ఖరీఫ్‌ సీజన్‌లోనే తుది అంచనాల ప్రకారం 12.73 లక్షల టన్నుల దిగుబడులు తగ్గాయి. 

రబీలో మూడో ముందస్తు అంచనాల ప్రకారం చూస్తే.. ఏకంగా 18.17 లక్షల టన్నుల దిగుబడులు తగ్గుతాయని అంచనా. వాస్తవాలు ఇలా ఉంటే.. 2024–25 సామాజిక ఆరి్థక సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఏకంగా 15.86 శాతం వృద్ధి రేటు (ప్రస్తుత ధరల ప్రకారం) సాధించినట్టు గొప్పలు చెప్పడంపై వ్యవసాయ రంగ నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు. 

ఖరీఫ్‌లో 15.50 లక్షల ఎకరాలు సాగుకు దూరం 
ఖరీఫ్‌–2024 సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ విడుదల చేసిన తుది అంచనాల ప్రకారం కేవలం 70.15 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ఆ సీజన్‌లో సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలుగా నిర్దేశించారు. అంటే ఒక్క ఖరీఫ్‌ సీజన్‌లోనే లక్ష్యంలో 15.50 లక్షల ఎకరాల్లో సాగవలేదు. 

ప్రధాన పంటల విషయానికి వస్తే.. 39.10 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వరి 35 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఆహార ధాన్యాల సాగు లక్ష్యం 53 లక్షల ఎకరాలు కాగా, 51 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. నూనె గింజల విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. ఈ పంటలు 16.50 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, కేవలం 11లక్షల ఎకరాలకే పరిమితమైంది. 

వీటిలో ప్రధానంగా 14.80 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వేరుశనగ 6.87 లక్షల ఎకరాలకు దిగజారింది. 14.67 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన పత్తి.. 10 లక్షల ఎకరాలకు పడిపోయింది. అపరాలు మినహా ఇతర ప్రధాన పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. కందులు, మొక్కజొన్న, ఆముదం పంటలు మాత్రమే లక్ష్యానికి మించి సాగయ్యాయి. సాగైన విస్తీర్ణంలో కూడా 6 లక్షల ఎకరాలు కరువు బారిన పడగా, దాదాపు 10 లక్షల ఎకరాలు వైపరీత్యాల బారిన పడ్డాయి.

రబీలోనూ అంతంతే
రబీ 2024–25 సీజన్‌ సాగు లక్ష్యం 57.67 లక్షల ఎకరాలు కాగా.. దిగుబడులు 94.70 లక్షల టన్నులు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు. మూడో ముందస్తు అంచనాల ప్రకారం 47.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. దిగుబడులు మాత్రం 76.53 లక్షల టన్నులకు పరిమితమవుతాయని అంచనా వేస్తున్నారు. అంటే విస్తీర్ణం పరంగా చూస్తే 10.22 లక్షల ఎకరాలు సాగుకు దూరం కాగా.. 18.17 లక్షల టన్నుల దిగుబడులు తగ్గే అవకాశం ఉందని అంచనా. 

ఖరీఫ్‌లో వరదలు, అకాల వర్షాలు, రబీలో తుపానులు, అకాల వర్షాలు, ఈదురు గాలుల ప్రభావానికి లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు ఖరీఫ్‌లో 54 మండలాలు, రబీలో 51 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నట్టు ప్రభుత్వమే ప్రకటించింది. వాస్తవాలు ఇలా ఉంటే తమ హయాంలో సేద్యం ఘనంగా ఉందంటూ పాలకులు గొప్పలు చెప్పుకోవడం విస్మయానికి గురి చేస్తోంది.

దిగజారిన దిగుబడులు
దిగుబడుల పరంగా చూస్తే ఖరీఫ్‌–2024 సీజన్‌లో 167.15 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని తొలుత అంచనా వేశారు. కానీ.. తుది అంచనాల ప్రకారం 154.43 లక్షల టన్నులకు పరిమితమైనట్టుగా లెక్కతేల్చారు. వరి దిగుబడులు 85.47 లక్షల టన్నులు వస్తాయని అంచనా వేయగా.. 78 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి. మొక్కజొన్న 7.84 లక్షల టన్నుల దిగుబడులు లక్ష్యం కాగా.. 6.78 లక్షల టన్నులకు తగ్గిపోయింది. 

మొత్తంగా ఆహార ధాన్యాల దిగుబడి 96.98 లక్షల టన్నులు వస్తుందని అంచనా వేయగా.. 88 లక్షల టన్నులకు పడిపోయాయి. అపరాలు 2.37 లక్షల టన్నులకు గాను 2.04 లక్షల టన్నులు, నూనె గింజల దిగుబడులు 7 లక్షల టన్నులు లక్ష్యం కాగా.. కేవలం 2.89 లక్షల టన్నులకు పడిపోయాయి. పత్తి 18.78 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేయగా.. 11 లక్షల టన్నులకు దిగజారింది. 

తీవ్రంగా నష్టపోయాను
గడిచిన ఖరీఫ్‌లో 5 ఎకరాలు తేజ రకం మిర్చి సాగు చేశాను. ఎరువులు, పురుగు మందులకు ఎకరానికి రూ. లక్షన్నర చొప్పున రూ.7.5 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఈసారి విపరీతమైన తెగుళ్లు సోకడంతో దిగుబడి సగానికి తగ్గింది. 2023–24లో ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్లు దిగుబడి వస్తే ఈ సంవత్సరం 10 క్వింటాళ్లు కూడా రాలేదు. 2023–24లో క్వింటాల్‌ మిర్చి రూ. 22 వేలు అమ్మితే ఈ సంవత్సరం రూ.8వేల నుంచి 10 వేలకు మించిలేదు. తెగుళ్లతో కాయ తాలుపోతోంది. తాలుకాయ క్వింటాల్‌ రూ.5 వేల –రూ.7 వేలకు మించి అమ్ముడు పోవడం లేదు. పెట్టుబడి కాదుకదా.. కూలీల ఖర్చులు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోయాను. 
– బోడపాటి వెంకటేశ్వర్లు, రైతు, రంపాడు పాపిరెడ్డిపల్లి, వైఎస్సార్‌ జిల్లా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement