స్పోర్ట్స్ కోటా ధ్రువపత్రాల ప్రామాణికతను మరోసారి పరిశీలించండి
చిల్లా మోహినీదేవి, సి.హెచ్.యోగేశ్వరరావు పేర్లు రికార్డుల్లో లేవు
శాప్ వీసీ, ఎండీకి ఏపీ ఖోఖో సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారామిరెడ్డి లేఖ
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందినట్లు చెబుతున్న ఇద్దరు అభ్యర్థుల క్రీడా ధ్రువపత్రాలపై ఆంధ్రప్రదేశ్ ఖోఖో సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి మంగళవారం లేఖ రాశారు. చిల్లా మోహినీదేవి, సీహెచ్ యోగేశ్వరరావు సమర్పించినట్లు చెబుతున్న క్రీడా ధ్రువపత్రాల ప్రామాణికతను పరిశీలించాలని ఆ లేఖలో ఆయన కోరారు.
వీరి సర్టిఫికెట్ల ధ్రువీకరణ కోసం శాప్ నుంచి తమ సంఘానికి ఎలాంటి సమాచారం, ఈ – మెయిల్ లేదా అభ్యర్థన రాలేదని స్పష్టం చేశారు. సంబంధిత టోర్నమెంట్కు సంబంధించి క్రీడాకారుల జాబితా, అధికారిక రికార్డుల్లో మోహినీదేవి, యోగేశ్వరరావు పేర్లు కనిపించలేదని తెలిపారు. వారి పేర్లతో తాము ఎలాంటి ప్రామాణికత, ధ్రువీకరణ పత్రాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. కాబట్టి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం పొందేందుకు సమర్పించిన ధ్రువపత్రాల చెల్లుబాటుపై సమగ్రంగా పరిశీలించాలని కోరారు.

నకిలీ, ఫోర్జరీ లేదా అనధికారిక సర్టిఫికెట్లు సమర్పించినట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత క్రీడాకారుల జాబితా, రికార్డుల కాపీలను లేఖకు ఆయన జత చేశారు. అంతేకాకుండా ఖోఖో సంఘం వద్ద ఉన్న రికార్డులు, సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను స్వయంగా తానే వెళ్లి శాప్కు అందజేశానని, ఈ–మెయిల్ ద్వారా కూడా పంపించామని సీతారామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.


