నాలుక్కర్చుకున్న ఇండియాటుడే– యాక్సిస్‌ మై ఇండియా | Rajdeep Sardesai said that rural people and women supported YSRCP | Sakshi
Sakshi News home page

నాలుక్కర్చుకున్న ఇండియాటుడే– యాక్సిస్‌ మై ఇండియా

Jun 3 2024 4:53 AM | Updated on Jun 3 2024 6:46 AM

Rajdeep Sardesai said that rural people and women supported YSRCP

రాష్ట్ర ఎన్నికలపై ఎగ్జిట్‌ పోల్స్‌పై విస్తుపోయిన రాజకీయ విశ్లేషకులు 

గ్రామీణ ప్రజలు, మహిళలు వైఎస్సార్‌సీపీకే మద్దతుగా నిలిచారన్న రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌

మీరు చేసిన సర్వే సహేతుకంగా లేదంటూ యాక్సిస్‌ మై ఇండియా అధినేత ప్రదీప్‌గుప్తాకు చురక

చంద్రబాబు అరెస్టుతో సానుభూతి, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మార్చే సంప్రదాయం ఉందన్న ప్రదీప్‌ గుప్తా 

కేజ్రీవాల్, హేమంత్‌ సోరేన్‌ అరెస్టుతో ఢిల్లీ, జార్ఖండ్‌ల్లో సానుభూతి వచ్చినట్లు మీ సర్వేలో కన్పించలేదేం అంటూ నిలదీసిన రాహుల్‌ కన్వల్‌ 

2021లో పశ్చిమ్‌ బంగా, 2023లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌లో తప్పిన ఇండియాటుడే–యాక్సిస్‌ మైఇండియా అంచనా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలపై వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌పై ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా నాలుక్కర్చుకుంది. యాక్సిస్‌ మై ఇండియా నిర్వహించిన  ఎగ్జిట్‌ పోల్స్‌ను ఇండియాటుడే శనివారం ప్రసారం చేసింది. ఈ సర్వేపై దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేయడంతో.. ఆదివారం ఇండియాటుడే టీవీలో చర్చ చేపట్టింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. ఐదేళ్లలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మారిపోయాయి.

డీబీటీ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్ల లబ్ది పేదలకు నేరుగా చేరాయి. జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల గ్రామీణ ప్రజలు..ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. వారంతా ఈ ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలిచారని అంచనా వేస్తున్నాం’ అని ఇండియా టుడే కన్సలి్టంగ్‌ ఎడిటర్‌ రాజీదీప్‌ సర్దేశాయ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌పై ఆదివారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగిన మార్పును నేను స్వయంగా చూసాను. పాఠశాలలు, ఆస్పత్రుల్లోచాలా మార్పు కన్పించిందన్నారు. ఈ నేపథ్యంలో మీరు చేసిన సర్వే సహేతుకంగా లేదన్నది స్పష్టమవుతోందంటూ యాక్సిస్‌ మై ఇండియా అధినేత ప్రదీప్‌ గుప్తాకు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చురకలంటించారు.

స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి.. దక్షిణాది రాష్ట్రాల్లో ఐదేళ్లకు ఓ సారి ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయం ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి అనుకూలించిందని ప్రదీప్‌ గుప్తా చెప్పారు. దీనిపై యాంకర్‌ రాహుల్‌ కన్వల్‌ స్పందిస్తూ.. కేజ్రివాల్‌ అరెస్టు వల్ల ఢిల్లీ, పంజాబ్‌ల్లో.. హేమంత్‌ సోరేన్‌ అరెస్టు వల్ల జార్ఖండ్‌లో ప్రజల్లో సానుభూతి రాలేదా.. అక్కడ ఎగ్జిట్‌ పోల్స్‌లో అది ప్రతిబింబించలేదేం అంటూ ప్రదీప్‌ గుప్తాను నిలదీశారు. తమిళనాడులో జయలలిత.. తెలంగాణలో కేసీఆర్‌ వరుసగా రెండు సార్లు విజయం సాధించారని ఎత్తిచూపారు.

వీటిని పరిశీలిస్తే.. మీ సర్వేలో శాస్త్రీయంగా లేదేమోనని అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రదీప్‌గుప్తా నీళ్లు నమిలారు. ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ 2021లో పశ్చిమ్‌ బంగాలోనూ అంచనాలు తప్పాయి. అక్కడ బీజేపీ విజయం సాధిస్తుందని తేల్చిచెప్పగా.. టీఎంసీ ఘనవిజయం సాధించింది. ఇక గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ఆ సంస్థ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడించింది. కానీ.. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement