సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో అల్పపీడనంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. ఉత్తర కోస్తాలో ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశముందన్న ఐఎండీ.. సముద్ర వాతావరణం అలజడిగా ఉంటుందని పేర్కొంది. రానున్న ఐదు రోజుల పాటు మత్స్యకారులు అప్రమత్తంగా అండాలని ఐఎండీ హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా జూలై నెలలోనూ సాధారణం కంటే తక్కువ వానలే కురిసే అవకాశమున్నట్లు ఐఎండీ తెలిపింది. దేశంలో దీర్ఘకాల(1971–2020) సగటు వర్షపాతం జూలైలో 280.4 మిల్లీ మీటర్లు కాగా, ఇందులో 94 శాతం మేర కురిసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. జూన్లో దేశం మొత్తమ్మీద 40 శాతం వరకు లోటు వర్షపాతం నమోదవ్వగా, మధ్య భారతంలో ఈ లోటు అత్యధికంగా 50.4 శాతం వరకు ఉందని ఐఎండీ తెలిపింది.



