వాయుగుండం: కోస్తా, సీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలు

Rain Forecast For Andhra Pradesh For Two Days - Sakshi

రెండ్రోజులు దక్షిణ కోస్తా వైపు పయనం

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం రానున్న రెండు రోజులు అదే దిశలో తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరంల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది.

దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి తేలికపాటి వర్షాలు మొదలవుతాయని తెలిపింది. 21, 22 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల చెదురుమదురు వానలకు అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 23వ తేదీ వరకు తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దీంతో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top