ఒక్క సీఐనే బాధ్యుడుని చేసి, పోలీసు పెద్దలను తప్పించేలా కుట్ర
ఇందుకు తగ్గట్టుగానే బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరణ
అదే దిశగానే సాగుతున్న దర్యాప్తు
రెండో రోజు కృష్ణలంక స్వర్గపురిలో పోలీసుల విచారణ
కాపు యువకుడు సాయికృష్ణను మార్కాపురం నుంచి పట్టుకొచ్చామన్న టాస్క్ఫోర్స్ పోలీసులు
కీలకంగా మారనున్న వీరి స్టేట్మెంట్లు
సాయికృష్ణ ఆచూకీ తెలియదని ఈ నెల 15న కోర్టులో చెప్పిన ఏజీపీ
కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం నానా తంటాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం రేపిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్, కనుమరుగు వ్యవహారం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. సీఐ నాగరాజు ఒక్కడినే బాధితుడిగా చేసి, మిగిలిన ప్రభుత్వ, పోలీసు పెద్దలను కేసు నుంచి తప్పించేందుకు బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొనే సమయంలోనే పలు జాగ్రత్తలు తీసుకున్నారు. గంటల తరబడి చర్చించి, పోలీసు పెద్దలకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు.
అక్రమ నిర్భందం గురించి దాచి ఉంచినందుకు 127(6) సెక్షన్ను జోడించారు. కరకట్ట బంగ్లా డైరెక్షన్లోనే ఈ కేసులో దర్యాప్తు సాగుతోందని తెలుస్తోంది. దీంతో విచారణాధికారులు సైతం మొదటి రోజు సీఐ ఒక్కడినే బాధ్యుడిగా చేసేలా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు రికార్డు చేశారు. టాస్క్ ఫోర్స్ ఏడీసీపీని విచారించి వాంగ్మూలం తీసుకున్నారు.
మార్కాపురం నుంచి సాయికృష్ణను ఎప్పుడు తీసుకు వచ్చారు.. ఇందు కోసం ఎవరిని పంపించారు.. విజయవాడకు తీసుకొచ్చాక ఎవరికి అప్పగించారు.. అని ప్రశ్నించినట్లు తెలిసింది. పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేసేందుకు సిబ్బందిని పంపించినట్లు ఆమె వివరించినట్లు సమాచారం. దీంతో సాయికృష్ణను తీసుకు వచ్చిన నలుగురు కానిస్టేబుళ్లనూ ప్రశ్నించారు. వీరు ఏం చెప్పారన్నదే ఈ కేసులో కీలకం కానుంది. సాయికృష్ణ మార్కాపురం నుంచి తెచ్చి, సీఐ నాగరాజుకు అప్పగించామనే ఆధారాలను ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లు సమాచారం.
కోర్టులో ఒకలా.. దర్యాప్తులో మరోలా
సాయికృష్ణ కుటుంబ సభ్యులు ‘మా కొడుకును చూపండయ్యా..’ అని వేడుకొంటూ పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగినా ఖాకీలు కనికరించలేదు. ‘నీకొడుకు లేడు.. ఫొటోకు దండేసుకో’ అంటూ సీఐ హేళనగా మాట్లాడారని తల్లి కన్నీటి పర్యంతమైంది. దీంతో జూన్ 2న కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 4న విచారణకు వచ్చింది. జూన్ 15వ తేదీన సాయికృష్ణను కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది.
అయితే పోలీసుల తరఫున వాదనలు వినిపించిన ఏజీపీ కృష్ణ ప్రణీత్.. సాయికృష్ణ అచూకీ తెలియదని, అందుకే కోర్టు ముందు హాజరు పరచలేదని తెలిపారు. అతన్ని వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అయితే ప్రస్తుతం మార్కాపురం నుంచి విజయవాడకు తెచ్చినట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు విచారణ అధికారికి ఇచ్చిన సమాచారం కీలకమవుతోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండానే సాయికృష్ణ అచూకీ తెలియలేదని ఏజీపీ కోర్టుకు ఎలా నివేదిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది లా ఉండగా సాయికృష్ణను తెచ్చి రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో కాకుండా, బయట హోటల్లో ఉంచి.. కొట్టి చంపి, దహనం చేయడం వెనుక ఓ పెద్ద సెటిల్మెంట్ వ్యవహారమే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ, పోలీసు పెద్దల హస్తం ఉండటం వల్లే ఇలా చేశారని విశ్వసనీయంగా తెలిసింది.
40 రోజులు ఎలా మేనేజ్ చేశారు?
సాయికృష్ణ మృతి చెందాక.. అనాథ శవంగా చిత్రీకరించి కృష్ణలంక స్వర్గపురి (విద్యుత్ శ్మశాన వాటిక)లో దహనం చేశారనే ఆరోపణల నేపథ్యంలో విచారణాధికారులు అక్కడి సీసీ పుటేజీ, అక్కడి నిబంధనల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఎలా దహనం చేశారన్న దానిపై ఆరా తీశారు. అయితే అనాథ శవాలను దహనం చేసినప్పుడు నిబంధనల ప్రకారం బూడిద ఇవ్వాల్సిన అవసరం లేదని స్వర్గపురి సిబ్బంది చెబుతున్నారు.అందుకే పోలీసులు ఇలా స్కెచ్ వేశారని సమాచారం.
మొత్తంగా ఈ కేసులో సూత్రధారులను రక్షించేలా పక్కా ప్రణాళికతో దర్యాప్తు సాగుతోందని పోలీసు వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఈ విషయం 40 రోజులపాటు మేనేజ్ చేశారంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీలకు.. నగర పోలీస్బాస్ చెప్పకుండా ఎలా ఉంటారని పోలీసు శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ చెప్పకుండా దాచి ఉంచారనుకుంటే అది నేరమే అని చెబుతున్నారు.
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శకు వచ్చి ఉండకపోతే ఈ కేసు తెరమరుగయ్యేదని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ రాక వల్లే ప్రభుత్వంలో ఒక్కసారిగా చలనం వచ్చిందని, ప్రజల్లో చులకనై పోతామనే భయంతో ఆగమేఘాలపై సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ, సీఎస్, సీపీలు సమీక్షలు.. సీఐ సస్పెండ్, కేసు నమోదు.. ఇలా అన్నీ చకచకా జరిగిపోవడం తెలిసిందే.


