ఉద్యాన వర్సిటీలో ఎన్‌ఆర్‌ఐ కోటా.. తొలిసారిగా అమలు 

NRI And Sponsored Quota Seats First Time In YSR Horticulture University - Sakshi

తొలిసారిగా అమలు 

అడ్మిషన్లకు అనుమతినిస్తూ ఉత్తర్వులు 

సాక్షి, అమరావతి: డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో తొలిసారి ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటాలో బీఎస్సీ హార్టికల్చర్‌ హానర్స్‌ కోర్సులో అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులిచ్చారు. సీట్ల భర్తీ కోసం మార్గదర్శకాలు విడుదల చేశారు. 

మార్గదర్శకాలివే.. 
యూనివర్సిటీ కాలేజీల్లో 15% సీట్లను ఈ కోటా కింద మెరిట్‌ ఆధారంగా భర్తీ చేస్తారు.
► ఈ కోటాలో సీట్లు పొందే వారికి రిజర్వేషన్లు వర్తించవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర రాయితీలు వర్తించవు.
► ఇంటర్‌లో 50 శాతం మార్కులు లేదా బైపీసీ, ఎంబైపీసీతో సమానమైన పరీక్షలో అర్హత పొంది ఉండాలి.
విద్యార్థులు తప్పనిసరిగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ స్థాయిల్లో ఇంగ్లిష్‌ మీడియంలో చదివి ఉండాలి.
అడ్మిషన్‌ సమయంలో ఇంగ్లిష్‌లో ప్రావీణాన్ని తెలిపే ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌ (ఐఈఎల్‌టీఎస్‌), టెస్ట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (టీవోఎఫ్‌ఈఎల్‌) సర్టిఫికెట్లను సమర్పించాలి. అలాగే.. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్, జనన ధ్రువీకరణ పత్రం, టీసీ, ఎన్‌ఆర్‌ఐ సర్టిఫికెట్‌తో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
సీటు పొందిన వారు ప్రతీ ఏటా 3500 యూఎస్‌ డాలర్లు ఇన్‌స్టిట్యూషనల్‌ ఫీజు కింద చెల్లించాలి. హాస్టల్, ఇతర ఫీజులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
సీటు పొందిన ప్రతి విద్యార్థి గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూ్యరెన్స్‌ స్కీమ్‌ (యువరక్ష) ప్రీమియం చెల్లించాలి.
ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పొందిన మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధీనంలో ఉన్నట్టుగా ధ్రువీకరణ పత్రం, స్పాన్సర్‌ కోటాలో సీటు పొందే వారికి ఎవరైతే స్పాన్సర్‌ చేస్తున్నారో వారి పాస్‌పోర్ట్, వీసా నకలు సమర్పించాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top