‘విద్యుత్‌’ లేని చోట డీజిల్‌ జనరేటర్లే | Niti Aayog Comments On Diesel Generators | Sakshi
Sakshi News home page

‘విద్యుత్‌’ లేని చోట డీజిల్‌ జనరేటర్లే

Nov 24 2020 5:01 AM | Updated on Nov 24 2020 5:02 AM

Niti Aayog Comments On Diesel‌ Generators - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విద్యుత్‌‌ సౌకర్యం లేని ప్రాంతాల్లో అత్యధికంగా డీజిల్‌ జనరేటర్లపై ఆధారపడుతున్నట్లు నీతిఆయోగ్‌ సర్వే వెల్లడించింది. విద్యుత్‌ సదుపాయం లేని చోట ఎటువంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగిస్తున్నారనే అంశంపై ఈ సర్వే నిర్వహించారు. విద్యుత్‌ సౌకర్యం లేని ప్రాంతాల్లో మొత్తం మీద అన్ని రకాల వినియోగదారులు 32 శాతం డీజిల్‌ జనరేటర్లపై ఆధారపడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై 20 శాతం, కిరోసిన్‌పై 16 శాతం, సోలార్‌ ప్యానల్స్‌పై పదిశాతం, స్థానిక మినీ గ్రిడ్స్‌పైన ఆరుశాతం ఆధారపడుతుండగా 19 శాతం తెలియదని చెప్పినట్లు సర్వే వెల్లడించింది.

కిరోసిన్‌కు సబ్సిడీ ఉండటంతో విద్యుత్‌ సౌకర్యం లేని చోట కిరోసిన్‌ వినియోగిస్తున్నారని, డీజిల్‌ సులభంగా లభిస్తుండటంతో వ్యవసాయ రంగంలో దాన్ని వినియోగిస్తున్నారని తేలింది. విద్యుత్‌ సౌకర్యం లేని ప్రాంతాల్లో విద్యుత్‌ మౌలిక సదుపాయాలను కల్పించాలని సర్వే సూచించింది. ఎక్కువగా కొండ ప్రాంతాలైన మేఘాలయ వంటి చోట అత్యధికంగా విద్యుత్‌ సౌకర్యం లేదని తేలింది. కొవ్వొత్తులు, రీచార్జి బ్యాటరీలను కూడా వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. విద్యుత్‌ లేని చోట దేశంలో రంగాల వారీగా గృహావసరాలు, వ్యవసాయం, వాణిజ్యం, ఇనిస్టిట్యూషన్లలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంపైన కూడా నీతిఆయోగ్‌ సర్వేలో విశ్లేషించారు. 

Advertisement
 
Advertisement
Advertisement