
నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు లెక్చరర్లకు జోన్లు మార్పు
జోన్– 4,3 నుంచి జోన్–1కి 56 మంది తరలింపు
జోన్, రీజియన్ పరిధి దాటి బదిలీలు
సర్వత్రా వెల్లువెత్తుతోన్న విమర్శలు
కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీకి కొత్తగా ఆన్లైన్ కౌన్సెలింగ్ నేడు
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన బదిలీల్లో అనేక తప్పులతో అభాసుపాలైన రాష్ట్ర సాంకేతిక విద్య, ఇప్పుడు కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీల విషయంలోనూ అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ఏటా జోన్ స్థాయిలో జరిగే బదిలీలను ఈసారి సాంకేతిక విద్య డైరెక్టరేట్ నుంచి వెబ్ కౌన్సెలింగ్ పద్ధతిలో చేపట్టనున్నారు. మంగళవారం ఈ ప్రక్రియ చేపట్టాలని షెడ్యూల్ విడుదల చేశారు. దీంతోపాటు జోన్–4లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పనిచేసే 56 మందిని జోన్–1లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో జూన్ నుంచి ఏప్రిల్ వరకు 11 నెలల కాలానికి ఆయా జోన్ల పరిధిలోని కాలేజీల్లో పనిచేసేందుకు విధుల్లోకి తీసుకుంటారు. కానీ ఈసారి కాంట్రాక్టు లెక్చరర్లను జోన్లు, రీజియన్లు దాటించి మరీ నియామకాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు..
గతేడాది 200 మంది అధ్యాపకులను సర్దుబాటు పేరుతో బదిలీలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తడంతో వాటిని రద్దు చేశారు. ఇకపై బదిలీల వ్యవహారం సవ్యంగా సాగుతుందని అందరూ భావించారు. అయితే గతానుభవాలను విస్మరించిన సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరేట్ మళ్లీ అదే రీతిలో బదిలీలకు తెరలేపింది. వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధి జోన్–4లో నియమించాల్సిన కాంట్రాక్టు లెక్చరర్లు 56 మందిని ఆంధ్రా రీజియన్ జోన్–1లో నియమించేందుకు నిర్ణయించారు. తక్కువ జీతాలకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను దాదాపు 900 కిలోమీటర్ల దూరంలో నియమించడం ఆశ్చర్యకరం.
ప్రస్తుతం పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్లు 309 మంది ఉన్నారు. గత ప్రభుత్వం 2022లో పీఆర్సీ అమలు చేయడంతో నెలకు రూ.61,960 వేతనం 10 రోజులు మినహా 12 నెలల కాలానికి పొందేవారు. కానీ కూటమి ప్రభుత్వం వీరి వేతనాన్ని రూ.54,060కు తగ్గించేందుకు నిర్ణయించింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో పాత వేతనమే ఉంచి ఉత్తర్వులిచ్చారు. దీంతోపాటు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నుంచి కూడా వీరిని తొలగించింది. ఇంత తక్కువ వేతనంతో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను జోన్ దాటి రీజియన్ పరిధిలోకి బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
అరకొరవేతనంతో అంతదూరమా?
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో రెండు నెలల క్రితం సిబ్బంది రేషనలైజేషన్ చేపట్టారు. మూడేళ్లుగా విద్యార్థులు లేని కోర్సుల్లో లెక్చరర్ పోస్టులు సహా లెక్చరర్లను అవసరమున్న చోటికి తరలించారు. ఇటీవల రెగ్యులర్ బదిలీలు పూర్తి చేశారు. జోన్–1లో 2009లో ఏర్పాటు చేసిన కాలేజీల్లో మాత్రం లెక్చరర్లను నియమించలేదు. ఈ ప్రాంతానికి పోస్టులు మంజూరు చేయకపోవడంతో జోన్ పరిధిలోని కాలేజీల్లోని రెగ్యులర్ లెక్చరర్లతో సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. అయితే, గతేడాది కూటమి ప్రభుత్వం వర్క్లోడ్ పేరుతో దాదాపు 200 మంది రెగ్యులర్ లెక్చరర్లకు సర్దుబాటు బదిలీలు చేసినా జోన్ స్థాయిలో జరగాల్సినవి రీజియన్లనే మార్చి మరీ చేశారు.
60 కి.మీ పరిధిలో చేపట్టాల్సిన సర్దుబాటును ఏకంగా 900 కి.మీ దూరంలో నియమించడంతో బాధితులు పోస్టుల్లో చేరకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. మళ్లీ ఈ ఏడాది రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకి బదిలీ చేసి వేధించడం తప్ప దీని ద్వారా ప్రభుత్వానికి, సాంకేతిక విద్యాశాఖకు వచ్చే లాభం ఏంటో తెలియడం లేదని వాపోతున్నారు.