అదే వాహనం గతనెల 6న గ్రామంలో తిరిగింది
నన్ను కూడా నర్సీపట్నం వద్ద అదే కారు ఢీకొట్టింది
అందులోని వారు నావైపు కోపంగా చూశారు
జ్ఞానేశ్వరి అదృశ్యంలో కారుపై అనుమానాలుచిన్నారి చిన తాతయ్య ఆరోపణ
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలో గతనెల ఆరో తేదీన అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ నెలరోజులైనా లభించలేదు. ఆ రోజు గ్రామంలో సంచరించిన ఏపీ 39 డబ్ల్యూఎఫ్ 1234 నంబరు గల కారుపై సోమవారం బంధువులు అనుమానం వ్యక్తంచేశారు. అదే కారుతో ఉద్దేశపూర్వకంగా ఆదివారం నర్సీపట్నం సమీపంలో తనను ఢీకొట్టారని శరీరంపై గాయాలను చూపిస్తూ జ్ఞానేశ్వరి చిన తాతయ్య కోటేశ్వరరావు ఆరోపించారు.
గతనెల 6న సీహెచ్ అగ్రహారంలో ఆ కారు సంచరించిందని, ఆ తర్వాత డి.పోలవరంలో కనిపించిందని, తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సమీపంలో తనను ఢీకొట్టిందని ఆయన చెప్పారు. ఢీకొట్టిన తర్వాత కారులో ఉన్న వ్యక్తి తనపై కోపంగా చూశాడన్నారు.
ఈ సంఘటనలతో జ్ఞానేశ్వరి అదృశ్యానికి కారులో తిరుగుతున్న వ్యక్తులకు సంబంధం ఉండొచ్చని కోటేశ్వరరావు అనుమానం వ్యక్తంచేశారు. అయితే, ఆ కారుకి వెనుక నంబరు ప్లేటు ఉంది కానీ, ముందులేదని ఆయన చెప్పారు. అదృశ్యమై నెలరోజులైనా జ్ఞానేశ్వరి ఆచూకీ తెలీకపోవడం, కనీసం ఏ చిన్న క్లూ కూడా లభించకపోవడంతో పోలీసులు వేర్వేరు కోణాల్లో విచారిస్తున్నారు. కోటేశ్వరరావు ఆరోపణలపై రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారిని వివరణ కోరగా.. ఈ ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు. కోటేశ్వరరావును విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.


