పవన్ వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికల్లో తీవ్రంగా విమర్శిస్తున్న నెటిజన్లు
వ్యవస్థలోని లోపాలు, నిరుద్యోగం, పరీక్షల నిర్వహణలో అవకతవకలపై యువత అసంతృప్తికి ప్రతీకగా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం
దేశవ్యాప్తంగా సీజేపీకి భారీ మద్దతుతో పాటు, సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో ఫాలోవర్లు
ఉద్దేశాలను అర్ధం చేసుకోకుండా తాజాగా జెన్ జీ యువత, కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు
దేశ సమగ్రతకు భంగం కలిగించే విభజనవాదులతో జెన్జీ యువతను, కాక్రోచ్ పార్టీలని పోల్చిన పవన్
ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్న పవన్.. యువత గురించి ఇంత చులకనగా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)పై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. వ్యవస్థలోని లోపాలు, నిరుద్యోగం, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలు, రాజకీయ పార్టీల వైఫల్యాలపై యువత వ్యక్తం చేస్తున్న అసంతృప్తికి ప్రతీకగా రూపుదిద్దుకున్న కాక్రోచ్ ఉద్యమాన్ని పవన్ కళ్యాణ్ తీవ్ర పదజాలంతో విమర్శించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఢిల్లీలో జరిగిన జనసేన సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. సుమతీ శతకంలోని ఉదాహరణను చెబుతూ చిన్న చీమలు కూడా బలమైన సర్పాన్ని చంపగలవని, అలాగే చిన్న చిన్న వ్యక్తులు, చిన్న చిన్న ఆలోచనలతో దేశ సమగ్రతకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. ఇలాంటి విభజనవాద ఆలోచనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ అలాంటి వాటికి సపోర్ట్ చేయవద్దని సూచించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు.
‘కాక్రోచ్’కు దేశవ్యాప్తంగా మద్దతిస్తే పవన్కు తప్పుగా కనిపిస్తోందా..?
నీట్ అక్రమాలపై నిరసనగా మే 16న అభిజీత్ డిప్కే అనే యువకుడు సీజేపీని ప్రారంభించాడు. ఈ పార్టీకి స్వల్ప వ్యవధిలోనే సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభించింది. సామాజిక వేదికలకు లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు. ‘ఒక ఉద్యమాన్ని మీరు ఎప్పటికీ అణచివేయలేరు. వ్యవస్థ పగుళ్లలో సైతం మేము జీవిస్తాం’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా యువత ఈ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో లక్షలాది మంది యువత ఈ ఉద్యమానికి మద్దతుగా పోస్టులు, మీమ్స్, వీడియోలు పెడుతున్నారు.
రాజకీయ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తడం, పాలక వర్గాల వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అందుకే యువతలో దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువత ఆవేదన వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోకుండా, ఆ ఉద్యమాన్ని అవమానకర పదజాలంతో పవన్ కళ్యాణ్ కొట్టిపారేయడం సరైన రాజకీయ వైఖరి కాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు, నిరసనలు సహజమని, వాటిని వినిపించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని పవన్కు వారు గుర్తు చేస్తున్నారు. ఒక ఉద్యమంతో ఏకీభవించకపోవచ్చు కానీ దాని వెనుక ఉన్న భావజాలాన్ని, సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా పవన్కు ఉన్నప్పటికీ తెర వెనుక అజెండాతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని వారు చెబుతున్నారు.
యువతకు మీరా ప్రతినిధి...??
యువతకు ప్రతినిధిగా, మార్పు కోసం, ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇలా జెన్జీ యువతను, వారు ఆదరిస్తున్న సీజేపీని ఎగతాళిగా మాట్లాడటంపై యువతరం మండిపడుతోంది. యువత వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని దేశద్రోహంగా లేదా సమాజ వ్యతిరేక ధోరణిగా చిత్రీకరించడం సమస్యల మూలాలను కప్పిపుచ్చే ప్రయత్నంగా మారుతుందని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఒకవైపు యువత నిరుద్యోగం, అవకాశాల కొరత, పాలనలో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతుంటే, మరోవైపు వారి ఆలోచనలను కొట్టిపారేస్తూ పవన్ మాట్లాడటం యువతను పవన్కు మరింత దూరం చేసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీపై వచ్చిన స్పందనను పవన్ చెప్పినట్లు కేవలం సోషల్ మీడియా ట్రెండ్గా కాకుండా, యువతలో పెరుగుతున్న అసంతృప్తికి అద్దం పట్టే సామాజిక సంకేతంగా చూడాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. యువత స్వరాన్ని వినేందుకు జనసేన నాయకత్వం సిద్ధంగా ఉందా? లేక తమకు నచ్చని అభిప్రాయాలను ఎగతాళి చేస్తూ చిన్నచూపు చూస్తుందా? అనే ప్రశ్నలు పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తలెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో ఏకిపడేస్తున్న నెటిజన్లు
కాక్రోచ్ జనతా పార్టీ గురించి, జెన్ జీ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్లు, రీల్స్, వార్తా కథనాలు సోషల్ మీడియా వేదికల్లో షేర్ అవుతున్నాయి. ‘నీట్ పేపర్ లీక్ అవ్వడాన్ని పవన్ సమర్థిస్తున్నారా’ అని పలువురు నిలదీశారు. ‘నిలకడ లేదు.. విలువలు లేవు’ అంటూ పవన్ ద్వంద్వ వైఖరిని మరికొందరు తప్పుబట్టారు. ‘విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేస్తే విభజనవాదం ఎలా అవుతుంది’ అంటూ ఇంకొందరు నిలదీస్తున్నారు.

ప్రధానంగా ‘నేషన్ ఫస్ట్ అనేది వాస్తవమేగానీ, యువత లేకుండా దేశం ఎక్కడుంది’ అని పవన్ కళ్యాణ్ను దుమ్మెత్తి పోస్తున్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపైన, విద్యార్థుల భవిష్యత్తుపైన పవన్ కళ్యాణ్ మాట్లాడాలని సామాజిక మాధ్యమాల వేదికగా యువత పవన్ను డిమాండ్ చేస్తున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామని, అధికారంలోకి వచ్చాక ఏపీలో జరిగే ఏ తప్పునూ ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి మరీ కాక్రోచ్ జనతాపార్టీ, జెన్ జీ యువతని కించపరుచ్తూ మాట్లాడి సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా ట్రోలింగ్కు గురవుతున్నారు.


