ఈసీ కొత్త మార్గదర్శకాలు తప్పక పాటించాలి | Mukesh Kumar Meena: EC new guidelines must be followed | Sakshi
Sakshi News home page

ఈసీ కొత్త మార్గదర్శకాలు తప్పక పాటించాలి

Feb 13 2024 4:59 AM | Updated on Feb 13 2024 3:59 PM

Mukesh Kumar Meena: EC new guidelines must be followed - Sakshi

విశాఖలో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనా 

సాక్షి, విశాఖపట్నం/తిరుపతి సిటీ:  రానున్న ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా జారీచేసిన మార్గదర్శకాలు, సూచనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనా స్పష్టంచేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమికల్‌ ఇంజరింగ్‌ బ్లాక్‌లో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గ ఆర్వోలు, ఏఆర్వోలకు నిర్వహిస్తున్న తొలి విడత శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.

మీనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల గురించి అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో 1,000 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు జాతీయస్థాయి మాస్టర్‌ ట్రైనర్లు వచ్చారని, వారి నుంచి ఎన్నికల ప్రారంభం నుంచి ముగిసే వరకు కొనసాగాల్సిన ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని అధికారులకు సూచించారు.

అనంతరం మాస్టర్‌ ట్రైనర్‌ సమీర్‌ అహ్మద్‌ జాన్, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. మల్లిఖార్జున ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. డీఆర్‌వో కె.మోహన్‌కుమార్, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, పాడేరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, ఏఆర్వోలు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement