‘ఆ నిర్ణయాలే వైఎస్సార్ సీపీ విజయానికి కారణం’
సాక్షి, గుంటూరు : గుంటూరు, విజయవాడ ప్రజలు అభివృద్ధి వికేంద్రీకరణకు స్పష్టమైన తీర్పునిచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ మోపీదేవి వెంకటరమణ పేర్కొన్నారు. రేపల్లెలో ప్రజలకు ఇచ్చిన హామీలను సంవత్సరంలో పూర్తి చేస్తామని భరోసానిచ్చారు. రేపల్లె పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి సీఎం తీసుకున్న నిర్ణయాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాయని అన్నారు.
గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రజలు ఇచ్చిన తీర్పు చూస్తే సీఎం వైఎస్ జగన్పై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుందన్నారు. గుంటూరులో చంద్రబాబు మాట్లాడిన మాటలకు ప్రజలే బుద్ధి చెప్పారని విమర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నైజం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అయితే ఇచ్చిన మాటను నెరవేరకపోవడంతో చంద్రబాబు నైజమని దుయ్యబట్టారు.