
సాక్షి, విశాఖపట్నం: కళింగపట్నం మీదుగా ఆగ్నేయంగా మధ్య బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
ఇది ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ మధ్యలో విస్తరించి నైరుతి వైపు వంగి ఉంది. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం, బుధవారం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. రాయలసీమలో పలుచోట్ల మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయి.