
సముద్రంలో కోట్ల టన్నుల నానోప్లాస్టిక్
చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహారం ద్వారా మన శరీరంలోకి
పీఈటీ, పీవీసీ, పీఈ సూక్ష్మకణాలుగా మారే అవకాశం
ఫలితంగా జీర్ణసమస్యలు, హార్మోన్లు, క్యాన్సర్ వంటి వ్యాధులు
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే శరణ్యం
దైనందిన జీవితంలో ఎంతో వెసులుబాటు కల్పించిందనుకున్న ఈ ప్లాస్టిక్.. ఇప్పుడు ప్రాణాంతకమైంది. నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీసి మనుషుల్ని మృత్యువు
వైపు నడిపిస్తోంది. మానవ జీవనాధారమైన సముద్రాలు, నదులు, జలవనరులు ప్లాస్టిక్తో కలుషితమవుతున్నాయి. మన కంటికి కనిపించని ప్లాస్టిక్ రేణువులు జలాలను కలుషితం చేయడమేగాక సముద్ర జీవుల్లోకి చేరుతున్నాయి. ఇవి చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహార ఉత్పత్తుల ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశించి తీవ్రప్రభావం చూపుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
సాక్షి, అమరావతి: ప్లాస్టిక్.. దైనందిన జీవితంలో ఎంతో వెసులుబాటు కల్పించిందనుకున్న ఈ ప్లాస్టిక్.. ఇప్పుడు ప్రాణాంతకమైంది. నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీసి మనుషుల్ని మృత్యువు వైపు నడిపిస్తోంది. మానవ జీవనాధారమైన సముద్రాలు, నదులు, జలవనరులు ప్లాస్టిక్తో కలుషితమవుతున్నాయి. మన కంటికి కనిపించని ప్లాస్టిక్ రేణువులు జలాలను కలుషితం చేయడమేగాక సముద్ర జీవుల్లోకి చేరుతున్నాయి. ఇవి చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహార ఉత్పత్తుల ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశించి తీవ్రప్రభావం చూపుతున్నాయి.
ప్లాస్టిక్ సీసాలు, సంచులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ నుంచి ప్లాస్టిక్ రేణువులు వస్తున్నాయి. సూర్యకాంతి, ఉష్ణోగ్రత, సముద్రతీర ఘర్షణ వంటి కారణాలతో ప్లాస్టిక్ ముక్కలు.. మైక్రోప్లాస్టిక్లుగా (ఒక మైక్రోమీటర్ కంటే పెద్దవి) ఆ తర్వాత నానోప్లాస్టిక్ (రేణువు)గా విడిపోతాయి. సౌందర్య సాధనాలు, సింథటిక్ ఫైబర్ దుస్తులు, టైర్ల రాపిడి వంటివి కూడా నానోప్లాస్టిక్ ఉత్పత్తికి కారణమవుతున్నాయి. తాజా అధ్యయనాల ప్రకారం ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో సుమారు 27 మిలియన్ మెట్రిక్ టన్నుల నానోప్లాస్టిక్ ఉన్నట్లు అంచనా. ఇది గత అంచనాల కంటే వేలరెట్లు ఎక్కువ. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోను నానోప్లాస్టిక్ కాలుష్యం అత్యంత తీవ్రస్థాయిలో ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
జలచరాలపై ప్రభావం
నానోప్లాస్టిక్ సముద్రజీవుల శరీరాల్లోకి ఆహారం నుంచి, పీల్చే గాలి ద్వారా ప్రవేశిస్తున్నాయి. చేపలు, రొయ్యలు, గుల్లలు వంటివి ఈ కణాలను తమ ఆహారంగా భావించి తినేస్తున్నాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అధ్యయనాల ప్రకారం బంగాళాఖాతంలో చేపల శరీరాల్లో నానోప్లాస్టిక్ ఉంది. ఈ కణాలు వాటి జీర్ణవ్యవస్థ, కాలేయం, గుండె వంటి అవయవాల్లో చేరి హార్మోన్ల అసమతుల్యతను కలిగించి పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. సముద్రంలో చిన్నజీవుల నుంచి పెద్దజీవుల వరకు నానోప్లాస్టిక్ వ్యాపిస్తుండడంతో సముద్ర జీవవైవిధ్యం కూడా ప్రభావితమవుతోంది.
పూర్తిగా తొలగించడం అసాధ్యం
నానోప్లాస్టిక్ కాలుష్యాన్ని పూర్తిగా తొలగించడం అసాధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కణాలు అత్యంత సూక్ష్మంగా ఉండడంతో నీటి నుంచి వేరు చేయడం సాధ్యం కావడంలేదు. అందువల్ల నివారణే మార్గం. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై నిషేదం విధించి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్, గ్లాస్, కాగితంతో చేసిన వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. సౌందర్య సాధనాల్లో మైక్రోబీడ్స్ను నిషేధించాలి.
రీసైక్లింగ్ సామర్థ్యాన్ని పెంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలోకి చేరకుండా నిరోధించాలి. ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు, పర్యావరణ విద్యపై పాఠాలు చేర్చాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేయాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రతి నీటి బిందువులోనూ..
చిన్న నీటి బిందువులోనే నానోప్లాస్టిక్ ఉండే పరిస్థితి ఉంది. ఈ ముప్పు మన భవిష్యత్తును మింగేయకముందే చర్యలు తీసుకోవడం అత్యవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనుషుల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం
చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఆహారాల ద్వారా నానోప్లాస్టిక్ మనుషుల శరీరంలోకి చేరుతోంది. జీర్ణవ్యవస్థలో చేరి రక్తం ద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపిస్తోంది. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పునరుత్పత్తి, థైరాయిడ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. పేగుల్లో నానోప్లాస్టిక్ చేరడం వల్ల జీర్ణకోశవ్యాధులు వస్తున్నాయి. నానోప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఈ కణాల ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు. మనదేశంలో సముద్రం మీద ఆధారపడి లక్షలాదిమంది ప్రజలు జీవిస్తున్నారు.
రోజూ కోట్లాదిమంది సముద్ర ఉత్పత్తుల్ని ఆహారంగా తీసుకుంటున్నారు. ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశి్చమబెంగాల్, గుజరాత్ వంటి రాష్ట్రాల తీరప్రాంతాల్లో చేపలవేట, ఆహార పరిశ్రమలు విస్తృతంగా ఉన్నాయి. విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు వంటి ప్రాంతాల్లో నానోప్లాస్టిక్ కాలుష్యాన్ని గుర్తించారు. ఐఐటీ, ఎన్ఐవో నిర్వహించిన పరిశోధనలు ఈ ప్రాంతాల్లోని చేపల్లో.. ప్లాస్టిక్ నీళ్ల సీసాల్లో ఉండే పాలిథిలీన్ టెరీఫ్తలేట్ (పీఈటీ), ప్లాస్టిక్ రాడ్లు, పైపుల్లో కనిపించే పొలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ), టిఫిన్ బాక్సులు, పెన్నులు వంటి వాటిలో ఉండే పోలీస్టైరీన్ (పీఎస్) వంటివి అధికంగా కనిపిస్తున్నట్లు తేలింది. ఇది నానోప్లాస్టిక్గా విడిపోయి మరింత సూక్ష్మంగా మారి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.