ధర ‘కోతా’పురి | mango farmers distress in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ధర ‘కోతా’పురి

Jun 27 2025 5:38 AM | Updated on Jun 27 2025 5:55 AM

mango farmers distress in Andhra Pradesh

గిట్టుబాటు ధర లేకపోవడంతో 5 టన్నుల మామిడి కాయలను రోడ్డుపై పారబోస్తున్న రైతు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల గగ్గోలు  

తోతాపురి మద్దతు ధర కేజీ రూ.8కి కూటమి సర్కార్‌ శఠగోపం  

ర్యాంపుల్లో కేజీ రూ.2.. ధర వెల్లడించని ఫ్యాక్టరీలు 

పలు పరిశ్రమల్లో తోతాపురి కాయల కొనుగోలుకు స్వస్తి

చిత్తూరుకు చెందిన ఓ రైతు తోతాపురి రకం మామిడి కాయలను కోసి లారీలో ఫ్యాక్టరీకి అమ్మకానికి పెట్టాడు. రోజులు గడిచినా ఫ్యాక్టరీ నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో రైతు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాయలను ఉచితంగా ఇచ్చేయాలని లారీ డ్రైవర్‌కు చెప్పడంతో... చిత్తూరు కైలాసపురం వాసులకు పంచిపెట్టారు.

తవణంపల్లి మండలం కృష్ణాపురం గ్రామ రైతు సుబ్రమణ్యంరెడ్డి రెండు రోజుల క్రితం ట్రాక్టర్‌ కాయల (5 టన్నులు)ను రోడ్డు మీద పారబోశారు. ర్యాంపులో తోతాపురి కేజీ రూ.2కు కొంటున్నారు. దీంతో స్థానిక తహసీల్దార్‌ తనిఖీ చేసి రూ.3కు కొనాలని నిర్వాహకుడిని ఆదేశించారు. దీనికి అతడు ఒప్పుకోలేదు.  తహసీల్దార్‌ ర్యాంపునకు కరెంట్‌ కట్‌ చేయించారు. విసిగిన సుబ్రమణ్యంరెడ్డి కాయలను రోడ్డుపై పారబోసి వెళ్లిపోయారు.

చిత్తూరు రూరల్‌: మామిడి రైతుల వ్యథ తీవ్రమవుతోంది. ఫలం పండినా... వారికి ప్రతిఫలం దక్క­డం లేదు. ప్రధానంగా తోతాపురి రైతు తిప్పలు చెప్పనలవి కాదు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8 ఎక్కడా దక్కడం లేదు. ర్యాంపుల్లో తోతాపురి కేజీ రూ.2కు మించి కొనడమే లే­దు. ఫ్యాక్టరీలో కొద్ది రోజులు రూ.8 నుంచి ప్రారంభమై..రూ.6, రూ.5, రూ.4కు  చివరికి రూ.2కి పడి­పోయింది. ప్రస్తుత ధరపై ఫ్యాక్టరీలు అసలు నోరు విప్పడం లేదని రైతులు మండిపడుతున్నారు.  

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 56 వేల హెక్టార్లలో మా­మిడి తోటలు విస్తరించాయి. తోతాపురి రకమే 39,895 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. 4.99 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు తోతాపురి 1.5 లక్ష టన్నుల కాయలు ఫ్యాక్టరీలకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  
43 పళ్ల గుజ్జు (పల్ప్‌) పరిశ్రమలున్నాయి. వీటిలో 31 పనిచేస్తున్నాయి. నిరుడు తయారు చేసిన గుజ్జు నిల్వలు యుద్ధాల కారణంగా నిలిచిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎగుమతులు పుంజుకున్నాయి. ప్రస్తుతం 50 వేల  టన్నుల గుజ్జు స్టాక్‌ ఉంది. దీన్ని సాకుగా చూపించి ఫ్యాక్టరీలు తోతాపురి కొనుగోలును ఆపేశాయి. తర్వాత జిల్లా అధికారుల ప్రయత్నంతో కొన్ని ఫ్యాక్టరీలు తాళం తీశాయి. ఈ నెల 6 నుంచి టోకెన్ల జారీ ప్రారంభించి కాయల 
కొనుగోళ్లకు శ్రీకారం చుట్టాయి. 

ఫ్యాక్టరీల ఎదుట ట్రాక్టర్ల క్యూ 
ఈ నెల 8 నుంచి ఫ్యాక్టరీలు తోతాపురి కొనుగోలుకు గేట్లు తెరిచాయి. అప్పటి నుంచి ట్రాక్టర్లు, లారీలు లోడ్‌తో వేచి చూస్తున్నాయి. రోజులు గడుస్తున్నా అన్‌ లోడింగ్‌ కావడం లేదు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని ఫుడ్‌ ఇనోసిస్‌ ఫ్యాక్టరీ నుంచి వేలాది ట్రాక్టర్లు, లారీలు రాష్ట్ర సరిహద్దును దాటి తమిళనాడు రాష్ట్రం కాటా్పడిలోని కింగ్‌స్టన్‌ కాలేజీ వరకు క్యూ కట్టాయి. ఇదే మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఉన్న టాసా ఫ్యాక్టరీని ట్రాక్టర్లు, లారీలు చుట్టుముట్టాయి.

రోజుల తరబడి అన్‌లోడింగ్‌ కాకపోవడంతో బండ్లల్లోని కాయలు జ్యూస్‌ అవుతున్నాయి. గంగాధరనెల్లూ­రు మండలం జైన్‌ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. రైతులు ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పూతలపట్టు, తవణంపల్లి, బంగారుపాళ్యం, పెనుమూరు, తిరుపతి జిల్లాలోని దామలచెరువు తదితర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ  రైతులు పస్తులు ఉంటున్నారు.  

ఫ్యాక్టరీలో మద్దతు కరువు
మద్దతు ధర కేజీ రూ.8, ప్రోత్సాహక నిధి రూ.4... మొత్తం కేజీ తోతాపురికి రూ.12 ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఫ్యాక్టరీలు తొలుత  కేజీ రూ.8 చొప్పున కొన్నాయి. వారం రోజుల్లో రూ.6కు తగ్గించేశాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనలేమని చేతులెత్తేశాయి. 10 రోజుల తర్వాత కొన్ని ఫ్యాక్టరీలు రేటును రూ.5కు దించాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఫ్యాక్టరీలు కొనుగోలు ధరను వెల్లడించడం లేదు. నగదు చెల్లింపులపై స్పష్టత ఇవ్వకుండా రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయి.  బిల్లుల్లో తూకం వివరాలు మాత్రమే నమోదు చేయడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. 

ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా 40 ర్యాంపులున్నాయి. వీటి నిర్వాహకులు సిండికేట్‌ అయి మామిడి ధరలను తగ్గించేస్తున్నారు. తొలుత తోతాపురి కేజీ రూ.4 అంటూ రంగంలోకి దిగారు. తర్వాత రూ.3.50, రూ.3కు కొన్నారు. గత వారం రూ.2.50 అని.. ఈ వారం రూ.2కు చేర్చారు.

కాయలు చెట్లల్లో రాలిపోయే పరిస్థితి ఉండడంతో... విధి లేని పరిస్థితుల్లో రైతులు చాలామంది ఇదే రేటుకు దింపి వస్తున్నారు. కొందరు రైతులు గిట్టుబాటు గాక, నీరసించి.. విసిగిపోయి.. రోడ్డుపై పారబోసి కన్నీళ్లతో ఇంటికెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రైతులు మండిపడుతున్నారు. మద్దతు ధరలో మభ్యపెట్టాలని చూస్తోందని విరుచుకుపడుతున్నారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మద్దతు ధర పేరుతో మాయ చేశారని విమర్శలు 
గుప్పిస్తున్నారు.

విధిలేక ర్యాంపునకు తోలుతున్నా.. 
నాకు 5 ఎకరాల దాకా మామిడి తోట ఉంది. తోతాపురి 20 టన్నుల వరకు వచి్చంది. ఫ్యాక్టరీకి ట్రాక్టర్‌లో రెండు లోడు కాయలు తరలించా. అక్కడ కొనలేమని చెబితే విధిలేక ర్యాంపుకు తీసుకొచ్చా. ర్యాంపుల్లో కేజీ రూ.2 అంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. పెట్టుబడి కూడా రాదు. ఈసారి రైతులు నిండా నష్టపోయారు.  
– సూర్యప్రకాష్, దాసరపల్లి, యాదమరి మండలం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement