
నూజివీడు మామిడికి సర్కారు మొండిచేయి
ఆగిరిపల్లిలో సీఎం పర్యటన నేపథ్యంలో రైతుల ఆశలు
గత ప్రభుత్వంలో రూ.275 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్లు
కూటమి రాకతో అటకెక్కిన వైనం
నల్లతామరతో ఇప్పటికే రైతుల సతమతం
పరిశోధన స్థానం ఉన్నా పట్టించుకోని సర్కారు
సాక్షి ప్రతినిధి,ఏలూరు: మామిడి సాగుకు నూజివీడు ఖ్యాతిగాంచింది. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా నూజివీడు మామిడికి మంచి పేరుతో పాటు డిమాండ్ ఉంది. అలాంటి మామిడి సాగు పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుంది. అకాల వర్షాలు, తెగుళ్లతో దిగుబడులు గణనీయంగా పడిపోయి రైతులకు ఏటా కన్నీళ్లే మిగులుతున్నాయి. ఈ తరుణంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నూజివీడు నియోజకవర్గంలో పర్యటించిన క్రమంలో మామిడి రైతుల్లో ఆశల రేకెత్తాయి.
ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశోధనా స్థానాన్ని అభివృద్ధి చేయడం వంటి హామీలతో పాటు రైతులకు నష్టపరిహారం ప్రకటిస్తారేమోనని అందరూ ఆశగా ఎదురుచూసి భంగపడ్డారు. 6 గంటల సీఎం పర్యటనలో మామిడి రైతుల గురించి కనీసం ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
కనీస చర్చ కూడా లేకుండానే..
ఏలూరు జిల్లాలోని నూజివీడు, చింతలపూడి నియోజకవర్గాల్లో మామిడి సాగు గణనీయంగా ఉంది. పదేళ్ల క్రితం వరకు సుమారు 80 నుంచి లక్ష ఎకరాల్లో విస్తరించిన మామిడి వరుస నష్టాలతో విస్తీర్ణంగా తగ్గుతూ వస్తోంది. ఆ స్థానంలో ఆయిల్పామ్, కోకో తోటలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 45 నుంచి 50 వేల ఎకరాల్లో మాత్రమే మామిడి సాగు ఉంది. గతేడాది నవంబర్, డిసెంబర్లో పూత బాగున్నా నల్లతామర తెగులుతో 70 శాతం దిగుబడి తగ్గిపోయింది.
జిల్లాలో ప్రధానంగా బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్దరసాలతో పాటు మరికొన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. మామిడికి అనుసంధానంగా ఎటువంటి పరిశ్రమలు లేకపోవడం, తెగుళ్ల నివారణను సమర్థంగా ఎదుర్కోవడానికి సాంకేతిక సహకారం, నిపుణుల సూచనలు లేకపోవడంతో ఏటా రైతులకు నష్టాలు తప్పడం లేదు.
ఈ నేపథ్యంలో ఆగిరిపల్లి మండలంలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఆయనకు స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం బొకేలు బదులు మామిడి పండ్లు బహూకరించారు. అయినా సీఎం పర్యటనలో మామిడికి సంబంధించి ఎలాంటి చర్చ జరగని పరిస్థితి.
గత ప్రభుత్వంలో రూ.275 కోట్లతో యూనిట్
మామిడి సాగు పరిరక్షణకు, రైతులకు మేలు చేసేలా నూజివీడులో మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ 20 ఏళ్లుగా ఉంది. జ్యూస్ పరిశ్రమ, పల్ప్ పరిశ్రమ, మామిడి తాండ్ర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానికంగా ధరలు బాగుండటంతో పాటు విస్తీర్ణం కూడా పెరుగుతుందనే వాదన ఉంది.
ఈ క్రమంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.256 కోట్లతో నూజివీడులో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 2023 నవంబర్లో జరిగిన సభలో ప్రకటించి వెంటనే నూజివీడు మండలంలోని సిద్ధార్ధనగర్లో 25 ఎకరాల భూమిని కూడా సేకరించి డీపీఆర్ను సిద్ధం చేసి బ్యాంకర్లకు పంపారు. అనంతరం ఎన్నికల కోడ్ రావడంతో ప్రాజెక్ట్ నిలిచిపోయింది.
ఊసే ఎత్తని పాలకులు
చంద్రబాబు మొదలు లోకేష్ వరకూ మామిడికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సభల్లో పలుమార్లు చెప్పినా ఆ దిశగా అడుగులు కూడా పడలేదు. నూజివీడులో వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా మామిడి పరిశోధనా కేంద్రం ఉన్నా పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవు.
పరిశోధనా స్థానం 18 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా 70 నుంచి 100 ఎకరాలు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అలాగే ముగ్గురు శాస్త్రవేత్తలు అందుబాటులో ఉన్నా సీజన్ పూర్తయిన తర్వాతే హార్టీకల్చర్, పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రి పార్థసారథి మామిడి పరిశ్రమను అభివృద్ధి చేస్తామని పలుమార్లు ప్రకటించినా ఆ దిశగా క్షేత్రస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు.
అప్పులు పాలయ్యాం
గత డిసెంబర్లో మామిడి పూతలు బాగా వచ్చాయి. జనవరి నెలాఖరుకు పూతంతా తెగుళ్లు, పురుగులతో మాడిపోయింది. కనీసం 20 శాతం కూడా పిందె కట్టలేదు. పూత నిలుపుకోవడం కోసం పది నుంచి 15 సార్లు పురుగు మందులు చల్లించి అప్పులపాలయ్యాం. ఇప్పుడు చూస్తే తోటల్లో కాయ కూడా లేదు. –డి.నాగమల్లేశ్వరరావు, సుంకొల్లు, నూజివీడు మండలం
నల్లతామర నుంచి రక్షించాలి
మూడేళ్లుగా తోటలు నల్లతామర బారిన పడుతున్నాయి. దీంతో రైతులు నిండా మునిగిపోతున్నారు. నల్లతామర వల్ల పూతంతా మాడిపోయి పిందె తయారు కావడం లేదు. దీంతో మామిడి రైతులు మూడేళ్లుగా నష్టాల పాలవుతున్నారు. ఈ ఏడాది మరింతగా నష్టాల్లో మునిగిపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. –పల్లే రవీంద్రరెడ్డి, తూర్పు దిగవల్లి, నూజివీడు