272, 274 సర్వే నంబర్లలో ఉన్నది సీఎం చంద్రబాబు నివాసమేనని చూపుతున్న శాటిలైట్ చిత్రం
కరకట్ట ఇంటిగుట్టు రట్టు
కరకట్టపై సీఎం చంద్రబాబు నివాసముంటున్న ఇల్లు తనదేనని ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించిన రాజ్యసభ జనసేన అభ్యర్థి లింగమనేని
ఉండవల్లిలోని సర్వే నంబర్ 272, 274ల్లో 1.32 ఎకరాల భూమి, అందులో 5,994 చ.అడుగుల భవనం తనదని పేర్కొన్న రమేష్
కేంద్ర శాటిలైట్ మ్యాప్ల ప్రకారం ఆ సర్వే నంబర్లో ఉన్నది సీఎం చంద్రబాబు అధికారిక నివాసమే.. ఆ భూమి ప్రస్తుత పరిస్థితిని అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొనని లింగమనేని
ప్రభుత్వంతో లీజు ఒప్పందం ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసుకున్నట్టు ప్రస్తావన
లింగమనేని కరకట్ట బంగ్లాలో 8–9 ఏళ్లుగా నివాసం ఉండటం వెనుక క్విడ్ప్రోకో దాగి ఉందని గతంలో తీవ్ర విమర్శలు
2014–19 మధ్య అప్పటి బాబు ప్రభుత్వం జరిపిన భూ సమీకరణ, ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులో లింగమనేనికి భారీ ప్రయోజనం చేకూరినట్టు ఆరోపణలు
ఈ అంశంపైనే గత ప్రభుత్వంలో సీఐడీ కేసు నమోదు
అప్పట్లోనే సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. 2024 ఫిబ్రవరిలోనే న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు
సాక్షి, అమరావతి: గడచిన 8–9 ఏళ్లుగా కృష్ణా నది కరకట్టపై సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు తనదేనని రాజ్యసభ జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించారు. అఫిడవిట్లో నేరుగా ఆ విషయాన్ని చెప్పకపోయినా.. ప్రకటించిన తన ఆస్తుల వివరాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 272, 272–1ఏ, 274లో డోర్ నంబర్ 17–3–781–1లో 1.32 ఎకరాల (52,630 చదరపు అడుగుల) భూమి, అందులో 5,994.62 చదరపు అడుగుల భవనం తనదేనని పేర్కొన్నారు.
2004, 2008 సంవత్సరాల్లో ఆ ఆస్తులను తాను కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్లానింగ్ కార్యక్రమాలకు ఉపయోగించే సర్వే నంబర్లతో సహా గ్రామాల మ్యాప్లు ‘భువన్ పంచాయతీ’ వెబ్పోర్టల్ ఆయా సర్వే నంబర్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం (రెసిడెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ఉన్నట్టు స్పష్టంగా పేర్కొంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉండే ఇంటితోపాటు ఆ చుట్టపక్కల 1.32 ఎకరాల భూమి జనసేన రాజ్యసభ్య అభ్యర్థి లింగమనేని సొంత ఆస్తులుగా తేలిపోయింది.

ఉండవల్లిలోని కృష్ణానది కరకట్ట బంగ్లా ఆస్తి వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న లింగమనేని
మరోవైపు లింగమనేని తన అఫిడవిట్లో ఆ భూమి ప్రస్తుత పరిస్థితి వివరాలు వంటివి పేర్కొనకపోయినప్పటికీ.. తన అఫిడవిట్లోనే వేరొక చోట 9(బీ) కాలమ్లో ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ(10–02–2026)న రాష్ట్ర ప్రభుత్వంతో రెంటల్/లీజ్ అగ్రిమెంట్ ఒప్పందం ఒకటి చేసుకున్నట్టు పేర్కొనడం గమనార్హం.
క్విడ్ప్రో కో.. కరకట్ట బంగ్లా కథ
రాజధాని అమరావతి నిర్మాణం పేరిట 2014–19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జరిపిన భూసమీకరణ, అమరావతి ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు ద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు లింగమనేని రమేష్ కు భారీ ప్రయోజనం చేకూర్చడంతో క్విడ్ప్రో కోలో భాగంగా లింగమనేని రమేష్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పు వెనుక రూ.వందల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణతోపాటు అప్పటి ప్రభుత్వంలో మంత్రి లోకేశ్ను కూడా నిందితుడిగా చేర్చి అప్పట్లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2024 ఫిబ్రవరిలోనే న్యాయస్థానంలో చార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. క్విడ్ప్రో కోలో భాగంగా లింగమనేని రమేష్ కృష్ణా నది కరకట్టపై ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపైనా కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి మసిపూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి.
ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేష్ మొదట్లో చెప్పారు. కానీ.. ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ, చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు. తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారని ప్రశ్నించేసరికి జవాబే లేదు. దాంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ప్రో కో కింద ఇచ్చారన్న దానిపై సీఐడీ అప్పట్లో ప్రధానంగా విచారణ జరిపింది. మళ్లీ ఇప్పుడు.. లింగమనేని రమేష్ ను టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి రాజ్యసభ జనసేన అభ్యర్థిగా ఎంపిక చేయడం, చంద్రబాబు కరకట్టపై నివాసం ఉంటున్న బంగ్లాను లింగమనేని తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనడంతో ఈ అంశానికి ప్రాధాన్యత చేకూరింది.

ప్రభుత్వంతో లీజు(రెంటల్) అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు పేర్కొన్న లింగమనేని
లింగమనేని, భార్య పేరిట రూ.213 కోట్ల ఆస్తులు
» లింగమనేని రమేష్ తో పాటు ఆయన భార్య పేరిట రూ. 213.39 కోట్ల స్థిర, చరాస్తులున్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. లింగమనేని రమేష్ పేరిట బ్యాంకు ఖాతాలో రూ.86,138 నగదు, రూ.18,52,69,885 డిపాజిట్లు, షేర్లు, బాండ్లు రూపంలో రూ.28,41,73,849, మరో రూ.15,06,16,960లను తెలిసిన వారికి, బంధువులకు, సంస్థలకు వ్యక్తిగత రుణాలు లేదా అడ్వాన్సులుగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. రూ.6 లక్షల విలువ చేసే 13.18 గ్రాములు బంగారు ఆభరణాలతో కలిపి తన పేరిట మొత్తం రూ.62.07 కోట్లు చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
» భార్య లింగమనేని సుమన పేరిట బ్యాంకు ఖాతాలో రూ.2,38,958, డిపాజిట్లుగా రూ.8,27,59,056, షేర్లు, బాండ్ల రూపంలో రూ.11,75,22,500, బంధువులు, సంస్థలకు అడ్వాన్సు రూపంలో ఇచ్చినవి రూ.26,51,01,285లతో పాటు రూ.2.68 కోట్ల విలువ చేసే ఒక కిలో ఎనభై గ్రాముల బంగారు ఆభరణాలు, 11.433 కేజీల వెండి కలిపి.. సుమన పేరిట మొత్తం రూ.49.24కోట్ల చరాస్తులున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు.
» ఇళ్లు, వ్యవసాయ భూములు వంటి స్థిరాస్తులుగా తన పేరిట రూ.8.46 కోట్లు ఆస్తులు ఉండగా.. భార్య సుమన పేరిట రూ.93.60 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు.
» తన పేరిట రూ.68.19 కోట్లు, భార్య సుమన పేరిట రూ.17.41 కోట్ల రుణాలు ఉన్నట్టు వెల్లడించారు.
» తనపై వివిధ రకాల కేసులు 11 ఉన్నట్టు పేర్కొన్నారు.


