కోవూరులో గంజాయి బ్యాచ్ దారుణం
కోవూరు: గంజాయి మత్తులో ఇద్దరు బాలురు ఓ చిన్నారి జీవితాన్ని చిదిమేశారు. విచక్షణ మరిచి బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీలోని కొత్తకాలనీలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. కోవూరుకు చెందిన మైనార్టీ బాలిక(12)పై అదే కాలనీకి చెందిన ఇద్దరు మైనర్లు కన్నేశారు.
శుక్రవారం గంజాయి మత్తులో ఉన్న వీరు బాలిక దుకాణానికి వెళ్లొస్తుండగా మాటేసి సమీపంలోని చెట్ల పొదల్లోకి లాక్కెళారు. అప్పటికే వైట్నర్ను కలిపి సిద్ధం చేసిన నీటిని తాగించారు. బాలిక స్పృహ కోల్పోగానే మృగాల్లా మారి లైంగిక దాడి చేశారు. మత్తు దిగిన తర్వాత బాధిత బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుని, తల్లిదండ్రులకు తనపై జరిగిన అమానుషాన్ని వివరించింది. పోలీసులకు సమాచారం అందించడంతో బాలికను నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


