
పీఎం 10 స్థాయి 42 పాయింట్లు
52 పాయింట్లతో రెండో స్థానంలో నెల్లూరు
అత్యధిక కాలుష్యం ఉన్న నగరంగా విశాఖ
పీఎం10 స్థాయి 120 పాయింట్లు
విశాఖ తర్వాత 76 పాయింట్లతో రాజమహేంద్రవరం
రాజధాని అమరావతిలో ఇప్పుడే 71 పాయింట్లకు చేరిన కాలుష్యం
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అతి తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా కడప మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023–24లో కడపలో వాతావరణ కాలుష్యం (గాలిలో ధూళి కణాలు పది మైక్రోమీటర్లు.. అంతకంటే తక్కువ వ్యాసం) పీఎం 10 సగటున 42 యూజీ/ఎం3 (ఎం క్యూబ్డ్)గా నమోదైంది. రాష్ట్రం మొత్తం మీద 15 ప్రధాన నగరాల వాతావరణ కాలుష్య గణాంకాలను కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం కాలుష్య తక్కువ ఉన్న నగరాల్లో 52 పాయింట్లతో నెల్లూరు రెండో స్థానంలో, 56 పాయింట్లతో కర్నూలు, ఒంగోలు మూడో స్థానంలో నిలిచాయి.
రాష్ట్రం మొత్తంమీద అత్యధిక కాలుష్యమున్న నగరంగా విశాఖ రికార్డులకు ఎక్కింది. విశాఖలో సగటున వాతావరణ కాలుష్యం 120 పాయింట్లుగా ఉంది. విశాఖ తర్వాత 76 పాయింట్లతో రాజమండ్రి రెండో స్థానంలో, 73 పాయింట్లతో విజయనగరం మూడో స్థానంలో నిలిచాయి. రాజధాని నిర్మాణం పూర్తి కాకుండానే, ఇంకా ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు మొదలు కాని అమరావతిలో కాలుష్యం సగటున 71 పాయింట్లు నమోదు కావడం గమనార్హం. దేశంలో అత్యంత కాలుష్య నగరంగా పేరొందిన ఢిల్లీలో సగటున 208 పాయింట్లు నమోదైంది. ఢిల్లీ తర్వాత నోయిడా 182 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
సత్ఫలితాలు ఇస్తున్న చర్యలు
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్క్యాప్) కింద దేశ వ్యాప్తంగా 130 నగరాలు, పట్టణాల్లో వాతావరణ కాలుష్యం తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు కొన్ని పట్టణాల్లో సత్ఫలితాలిస్తున్నాయి. మన రాష్ట్రంలో విజయవాడలో కాలుష్యం బాగా తగ్గినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 2022–23లో 90 పాయింట్లుగా ఉన్న కాలుష్య స్థాయి 2023–24 నాటికి 61 పాయింట్లకు తగ్గింది. కడపలో 57 నుంచి 42 పాయింట్లకు, కర్నూలులో 64 నుంచి 56, నెల్లూరులో 56 నుంచి 52, శ్రీకాకుళంలో 71 నుంచి 68, విజయనగరంలో 75 నుంచి 73 పాయింట్లకు తగ్గింది.
మిగిలిన పట్టణాల్లో కాలుష్య స్థాయి పెరిగింది. వాతావరణ కాలుష్యం తగ్గించడానికి బీఎస్6 ప్రమాణాలను అమలు చేయడం, పాత వాహనాలను తుక్కు చేసిన వారికి ప్రోత్సాహకాలు అందించడం, చెత్తను సమర్థవంతంగా నిర్వహించడం, థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో కనీసం 5 శాతం వ్యవసాయ వ్యర్థాలను వినియోగించేలా నిబంధనలు తీసుకురావడం వంటి అనేక చర్యలను కేంద్రం అమలు చేస్తోంది.