పిల్లలు తినకుండా పడేసిన అన్నం చూపించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కృష్ణకుమార్
కుళ్లిన కోడిగుడ్లను పిల్లలకు ఎలా పెడుతున్నారు?
ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కృష్ణకుమార్ ఆగ్రహం
పలమనేరు: ‘మధ్యాహ్నం భోజనాన్ని మరీ ఇంత అధ్వానంగా తయారు చేస్తారా? కుళ్లిన కోడిగుడ్లు పిల్లలకు ఎలా పెడుతున్నారు?’ అని జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో), మండల విద్యాశాఖాధికారులు(ఎంఈవోల)పై ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కృష్ణకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనంలోని వెజిటబుల్ రైస్ని రుచి చూసి.. అసంతృప్తి వక్త్తం చేశారు. భోజనం గురించి విద్యార్థులను ఆరా తీశారు. తమకు కుళ్లిన కోడిగుడ్లను పెడుతున్నారని.. వంటలు రుచిగా లేవంటూ విద్యార్థులు వాపోయారు.
తాగేందుకు కూడా మంచి నీళ్లు లేవని.. ట్యాంకులో ఉన్న పాచిపట్టిన నీటిలో పురుగులున్నాయని.. వాటినే తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన నీళ్ల ట్యాంకును పరిశీలించి.. ప్రధానోపాధ్యాయుడు షంషీర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు తినకుండా పడేసిన భోజనాన్ని డీఈవో లక్ష్మీనారాయణ, ఎంఈవోలు లీలాకుమారి, సుజాతకు చూపించి.. వారిని నిలదీశారు. రిజిస్టర్ ప్రకారం స్టోర్ రూమ్లో 2,795 గుడ్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే పాడైన గుడ్లు ఉండడాన్ని గుర్తించిన ఆయన.. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరతామని చెప్పారు. ఇంత నిర్లక్ష్యంగా మధ్యాహ్నం భోజనం వండుతున్న నిర్వాహకులను తొలగించాలని డీఈవోను ఆదేశించారు.


