
పోలీసులతో ఫోనులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
గంజాయి బ్యాచ్ ఆధ్వర్యంలోనే అక్రమాలు
సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే కొలికపూడి ఆగ్రహం
తిరువూరు: ఆంధ్ర నుంచి తెలంగాణకు టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమంగా తరలిపోతోందని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవాణాతో టీడీపీ నేతలు అక్రమార్జనకు పాల్పడుతున్నారని విమర్శించారు. శుక్రవారం అర్ధరాత్రి తిరువూరు మండలంలోని పెద్దవరం వద్ద తెలంగాణ సరిహద్దుల్లో ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు ఇసుక అక్రమంగా నిల్వ చేసి అమ్ముతున్నారని సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కొలికపూడి, ఆ గ్రామం వెళ్లి డంపింగ్ చేసిన ఇసుకను పరిశీలించారు.
ఒకే వ్యక్తి పేరుతో ఇసుక నమోదు చేసి తెలంగాణకు తరలిస్తున్నారని, ఈ అక్రమ రవాణాను పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ఏసీపీ ప్రసాదరావుపై ఫోనులోనే విరుచుకుపడ్డారు. ఇటీవల తిరువూరులో ఘర్షణకు పాల్పడిన గంజాయి బ్యాచ్ ఆధ్వర్యంలోనే ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని, పోలీసులు నేరాల అదుపులో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పటిష్ట నిఘా ఉంచామని, నేరాలు అదుపు చేస్తామని చెబుతున్న పోలీసులు అవసరమైన చోట సీసీ కెమెరాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారని ఎద్దేవా చేశారు.