పండుగలా పట్టాల పంపిణీ  | Housing Rails Distribution For the Poor Continued Its Eighth Day In AP | Sakshi
Sakshi News home page

పండుగలా పట్టాల పంపిణీ 

Jan 2 2021 4:59 AM | Updated on Jan 2 2021 4:59 AM

Housing Rails Distribution For the Poor Continued Its Eighth Day In AP - Sakshi

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో ఇళ్లపట్టా అందిస్తున్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు

సాక్షి నెట్‌వర్క్‌:  రాష్ట్రవ్యాప్తంగా నూతన సంవత్సరం తొలిరోజు కూడా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల ఒప్పంద పత్రాలు, ఆస్తిహక్కు పత్రాలు పంపిణీ చేశారు. కృష్ణాజిల్లాలో 8వ రోజైన శుక్రవారం 950 పట్టాలను పంపిణీ చేశారు. నందివాడ మండలం జనార్ధనపురంలో మంత్రి కొడాలి నాని పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలను అందజేసి ఇళ్లకు భూమిపూజ చేశారు. కైకలూరు మండలంలో 586 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. 

► గుంటూరు జిల్లాలో శుక్రవారం 329 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. డిసెంబర్‌ 25 నుంచి ఇప్పటివరకు మొత్తం 86,879 మందికి పట్టాలు అందజేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో ఎమ్మెల్యే విడదల రజిని, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్‌ మండలం ఇప్పటంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదలలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేదలకు పట్టాలను పంపిణీ చేశారు.  
► పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం మొత్తం 785 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 59,962 మందికి ఇళ్ల పట్టాలు అందించినట్లయింది. 
► తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం 7,169 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు 70,553 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 
► విశాఖ జిల్లాలో మొత్తం 1,271 మందికి ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల ఒప్పంద పత్రాలు, ఆస్తిహక్కు పత్రాలు శుక్రవారం పంపిణీ చేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలో 1,021 మందికి, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో మాడుగులలో 150 మందికి  పట్టాలను పంపిణీ చేశారు. 
► విజయనగరం జిల్లాలో శుక్రవారం 1,043 ఇళ్ల పట్టాలు, 500 టిడ్కో ఇళ్లు, 236 పీసీ/ఈఆర్‌ పట్టాలు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో శుక్రవారం 32 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల్ని పంపిణీ చేశారు. ఎనిమిది రోజుల వ్యవధిలో మొత్తం 32,592 మంది పేదలు పట్టాలు అందుకున్నారు. 
► చిత్తూరు జిల్లావ్యాప్తంగా శుక్రవారం 1,371 ఇళ్ల  పట్టాలను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వైఎస్సార్‌ జిల్లాలో శుక్రవారం 35 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 
► అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరులో మంత్రి శంకరనారాయణ 95 మందికి పట్టాలు పంపిణీ చేశారు. 
► కర్నూలు జిల్లా నందికొట్కూరు మండల పరిధిలో ఎంపీ పోచా బ్రహా్మనందరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఆదోని మండల పరిధిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, కర్నూలు మండలం పంచలింగాలలో ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement