గుండెల్లో గాయాలు.. ఆ గ్రానైట్ పేలుళ్లు..! | Horrible conditions in quarries in Prakasam district | Sakshi
Sakshi News home page

గుండెల్లో గాయాలు.. ఆ గ్రానైట్ పేలుళ్లు..!

Jun 11 2025 2:32 AM | Updated on Jun 11 2025 2:32 AM

Horrible conditions in quarries in Prakasam district

పంట పొలాలకు నష్టాలు   

గ్రామాల్లో ఇళ్లకు బీటలు 

చోద్యం చూస్తున్న అధికారులు   

ప్రకాశం జిల్లాలో దారుణ పరిస్థితులు

ప్రకాశం జిల్లా బల్లికురవ, సంతమాగులూరు, మార్టూరు, అద్దంకి మండలాల్లో అనధికారికంగా నిర్వహిస్తున్న గ్రానైట్, మెటల్‌ క్వారీల బ్లాస్టింగ్‌ కార్యకలాపాలు కార్మికులు, సమీప గ్రామాల ప్రజలు,  పొలాలు, ఇళ్లకు ముప్పుగా మారాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై  దృష్టి సారించి తక్షణం పరిష్కార చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.  – బల్లికురవ

రైతులకు కష్టం.. ఇళ్లకు నష్టం 
బ్లాస్టింగ్‌ కారణంగా కొండల సమీపంలోని పంట పొలాల్లోకి రాళ్లు కుప్పలుగా పడిపోతున్నాయి. పొలాల్లో మొక్కజొన్న, కంది, సుబాబుల్, జామాయిల్‌ వంటి పంటలు దెబ్బతింటున్నాయి. రైతులు దీనిపై ప్రశ్నిస్తే, ‘‘మేమూ బతకాలి కదా!’’ అంటూ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా స్పందిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక బ్లాస్టింగ్‌ ధాటికి పక్కా ఇళ్లకు గోడల్లో పగుళ్లు వస్తున్నాయి. ‘‘రోజూ మా ఇల్లు కంపించిపోతుంది. ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉంది’’ అని ఒక మహిళ వాపోయారు. 

మ్యాగ్‌జైన్‌ వ్యవస్థే పరిష్కారం? 
అధికారిక అనుమతులతో మ్యాగ్‌జైన్‌లు ఏర్పాటు చేసి, బ్లాస్టింగ్‌ మెటీరియల్‌ నిల్వ చేసే విధానం ఉంటే, ప్రమాదాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. కానీ అక్రమ నిల్వలు, అశ్రద్ధతో క్వారీలు నడిపితే ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరిస్తున్నారు. 

కొన్ని గ్రానైట్‌ క్వారీల యాజమాన్యాలు అధికార అనుమతులతో మ్యాగ్‌జైన్‌లు ఏర్పాటు చేసుకుని బ్లాస్టింగ్‌ మెటీరియల్‌ను నిల్వ చేసుకుంటున్నా,  మెజారిటీ క్వారీల విషయంలో అక్రమంగా బ్లాస్టింగ్‌ మెటీరియల్‌ను నిల్వ చేసుకుంటూ, మొబైల్‌ వ్యాన్‌ల ద్వారా వాటిని రోజూవారీ సరఫరా చేస్తుండడం గమనార్హం.  

కార్మికుల ప్రాణాలు పోతున్నా.. స్పందన శూన్యం 
గ్రానైట్, మెటల్‌ క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల నుంచి వలస వస్తున్నారు.  సరైన భద్రతా చర్యలు లేకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు. గత పదేళ్లలో బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో 60 మంది పైగా కార్మికులు మరణించినట్లు సమాచారం.

అయినప్పటికీ యాజమాన్యాలపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చనిపోయిన కార్మికులను గుట్టుచప్పుడు కాకుండా స్వస్థలాలకు తరలించి, సెటిల్మెంట్లతో వ్యవహారాన్ని ముగిస్తున్నారని స్థానిక వలస కార్మికులు ఆరోపిస్తున్నారు.

విస్తరించిన క్వారీలు 
» బల్లికురవ మండలంలోని ఈర్లకొండ పరిసర గ్రామాల్లో 30కి పైగా గ్రానైట్‌ క్వారీలు ఉన్నాయి. 
»  సనకొండ, ఎస్‌ఎల్‌గుడిపాడు, రామాంజనేయపురం, కొండల్లో 250 మెటల్‌ క్వారీలు నడుస్తున్నాయి. 
» సంతమాగులూరులోని గురిజేపల్లిలో 30కి పైగా, ఏల్చూరులో 140 మెటల్‌ క్వారీలు ఉన్నాయి. 
»  మార్టూరు మండలంలోని నాగరాజుపల్లి, అద్దంకి మండలంలో ధర్మవరం, జంగమహేశ్వరపురం కొండల్లో 400కి పైగా మెటల్‌ క్వారీలు కొనసాగుతున్నాయి.

బ్లాస్టింగ్‌ మోతతో నా ఇంటికి పగుళ్లు  
రూ.లక్షలు ఖర్చు చేసి పక్కా ఇల్లు నిర్మిoచుకున్నా. బ్లాస్టింగ్‌ మో­త­లతో ఇంటి గోడలు పగుళ్లు ఇస్తున్నాయి.  ప్రజలు  గ్రామాలు వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.  – బండి ఏసు, పాతమల్లాయపాలెం    

పొలాలకు వెళ్లాలంటే భయమేస్తోంది... 
పంట పొలాలకు వెళ్లాలన్నా భయపడుతున్నాం. ఏ సమయంలో  ఎక్కడి క్వారీలో నుంచి రాయివచ్చి పడుతుందోనని ఆందోళన చెందుతున్నాం. క్వారీలతో పంట భూములు రాతి నేలలుగా మారుతున్నాయి.  – బూసా వెంకటేశ్వర్లు,రైతు, రామాంజనేయపురం   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement