
మహారాణిపేట (విశాఖ): వాయవ్య బంగాళాఖాతంలో ఆవరించి ఉన్న వాయుగుండం పశ్చిమ బెంగాల్–బంగ్లాదేశ్ తీరాల వెంబడి కదిలి గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. మధ్యాహ్నానికి పశ్చిమ బెంగాల్–బంగ్లాదేశ్ తీరాలను దాటింది.
అదే సమయంలో పశ్చిమ బెంగాల్ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో దక్షిణ ఛత్తీస్గఢ్, దానికి అనుకుని ఉన్న తూర్పు విదర్భపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
శుక్రవారం శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరి, విశాఖ,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూగో, పగో,ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నెల్లూరు,నంద్యాల, వైఎస్ఆర్ కడప,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. pic.twitter.com/uPu8SrZk5i
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 29, 2025
ఇక, శుక్రవారం.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి, విశాఖ,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు.. గురువారం పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
ఇదిలా ఉండగా.. ఏపీవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే భారీగా ఈదురు గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణ, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలపై రాష్ట్రంలోని పలు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి.. తగిన విధంగా సూచనలు జారీ చేసినట్లు చెప్పింది.