
‘యోగాంధ్ర’కు ప్రజలను తీసుకెళ్లి అవమానపడ్డాం
అందరితోనూ చీవాట్లు తిన్నాం
జీవీఎంసీ ఆర్పీల కన్నీటి ఆవేదన
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోయి నిర్వహించిన ‘యోగాంధ్ర–2025’కార్యక్రమం జీవీఎంసీ పరిధిలోని రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ)కు తీవ్ర ఆవేదనను, అవమానాన్ని మిగిల్చింది. అధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు, సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం కారణంగా తాము ప్రజల చేత మాటలు పడాల్సి వచ్చిందని, ఈ ఉద్యోగమే వద్దనుకునేంతగా మానసిక క్షోభ అనుభవించామని ఆర్పీలు వాపోతున్నారు.
ప్రధాని మోదీ పాల్గొన్న ‘యోగాంధ్ర’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో అధికారులు జన సమీకరణ బాధ్యతను పూర్తిగా ఆర్పీల మీద పెట్టారు. ప్రతి ఆర్పీ వందల మందిని కార్యక్రమానికి తీసుకురావాలని లక్ష్యాలు నిర్దేశించారు. ఉదయం 6.30 గంటలకల్లా కార్యక్రమం ముగిసి, 8 గంటలకంతా అందరూ ఇళ్లకు వెళ్లిపోవచ్చని, అక్కడ అల్పాహారం, మంచినీటి సౌకర్యాలు ఉంటాయని జనాలకు నచ్చజెప్పి ఆర్పీలు వారిని తీసుకువచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా మారింది. గంటల తరబడి ప్రజలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
నిర్వాహకులు కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా అందించలేకపోయారు. మ్యాట్ల కోసం కొట్టుకున్నారు. స్నాక్స్ కోసం తోపులాటలు జరిగాయి. దీంతో ఆర్పీలు తీసుకువచ్చిన జనం, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాహంతో, ఆకలితో అలమటించారు. చివరకు తమను తీసుకువచ్చిన ఆర్పీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం కోసం ఎంతో కష్టపడితే అన్ని వైపుల నుంచి తిట్లు..చీవాట్లు మిగిలాయంటూ ఆర్పీలు వాట్సాప్ గ్రూపుల్లో ఆవేదన చెందుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం, ఆర్పీల ఆవేదన
‘వేకువ జామున 2 గంటల నుంచి ఇంటింటికి వెళ్లి వారి తలుపులు తట్టి జనాన్ని యోగాంధ్రకు తీసుకెళ్లాం. గుండె జబ్బు ఆపరేషన్ చేయించుకున్న ఓ ఆర్పీ యోగాంధ్రకు 100 మందిని తీసుకెళ్లారు. అయితే ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాం. ఒకవైపు అధికారుల నుంచి ఒత్తిడి, మరోవైపు స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజల నుంచి చీదరింపులు ఎదుర్కొన్నాం. పని పూర్తయ్యాక అధికారులు చల్లగా జారుకున్నారు. కానీ మేం మాత్రం ప్రజల చేత తిట్లు తినాల్సి వచ్చింది. మమ్మల్ని నమ్మి వచ్చినవారికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోయాం.
తీసుకెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిరిగి వస్తే చాలు అనుకునేంత నరకాన్ని చూశాం’ అని ఆర్పీలు తమ గ్రూపుల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేవలం రూ.10వేల జీతానికి ఇంతటి అవమానమా? 20 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాం, కానీ ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. గతంలో ఏ కార్యక్రమం జరిగినా ఆహారం, నీళ్ల బాధ్యత మాకే అప్పగించేవారు. కానీ ఇప్పుడు మమ్మల్ని కేవలం జన సమీకరణకే వాడుకుని, తర్వాత బలిపశువులను చేశారు’ అని వాపోయారు. ఈ మానసిక వేదనతో ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పలువురు ఆర్పీలు పేర్కొన్నారు.