కార్మికుడు పెంటయ్య ఫొటో చూపిస్తున్న కుమారుడు ప్రసాద్
మృతుడు పెంటయ్య కుటుంబానికి యంత్రాంగం బుజ్జగింపులు..
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా
విశాఖ: స్టీల్ ప్లాంట్లో ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో మరణించిన జూనియర్ టెక్నీషియన్ బలిరెడ్డి పెంటయ్య కుటుంబానికి ఇంతవరకు నష్ట పరిహారం అందకపోవడంపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖ కూర్మన్నపాలేనికి చెందిన పెంటయ్య భార్య వెంకటలక్ష్మి, కుమారుడు ప్రసాద్ బుధవారం విశాఖలో సెవెన్ హిల్స్ ఆస్పత్రికి వచ్చిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమ గోడు చెప్పుకున్నారు. యాజమాన్యం తమను మోసం చేస్తోందని వాపోయారు.
పెంటయ్య గతేడాది మార్చి 14న ఎస్ఎంఎస్–2 విభాగంలో జరిగిన ద్రవ ఉక్కు లీకేజీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఏప్రిల్ 1న మృతి చెందినట్లు భార్య తెలిపారు. భద్రతా లోపాలపై ప్రమాదానికి ముందే తన తండ్రి ఉన్నతాధికారులను హెచ్చరించినా పట్టించుకోలేదని ప్రసాద్ చెప్పారు. ఏడాది దాటుతున్నా పరిహారం ఇవ్వకుండా సాకులు చెబుతున్నారన్నారు.
తాము వైఎస్ జగన్ను కలవడానికి వస్తున్నట్లు తెలిసి స్టీల్ప్లాంట్ ప్రతినిధులు, కొందరు స్థానిక నేతలు తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఉద్యోగం ఇస్తామంటూ నమ్మబలికారని తెలిపారు. బాధిత కుటుంబం ఆవేదనను విన్న వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడే సమయంలో ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


