
మాన్యువల్గా కొనసాగించేందుకు ప్రభుత్వ యత్నం
మాన్యువల్గా ప్రవేశాలు జరిగితే భారీ అవకతవకలకు అవకాశం
ఉన్నత విద్యా మండలి, అధికారుల మధ్య సమన్వయ లోపం
పైచేయి కోసం ఉన్నత విద్యా మండలి నిర్ణయాల అమలుకు అడ్డంకి
విద్యాశాఖ మంత్రి ఓఎస్డీ, ఉన్నతాధికారుల నిర్వాకంతో విద్యార్థులకు నష్టం
2 వారాల కిందట ఆన్లైన్ ప్రవేశాలకు బిడ్లు తెరిచిన ఉన్నత విద్యా మండలి
కానీ, ఇప్పటివరకు అడ్మిషన్ల నిర్వహణపై అనుమతులు ఇవ్వని ప్రభుత్వం
అకడమిక్ వ్యవహారాల్లోనూ డ్యుయల్ మేజర్పై సందిగ్ధతే
తక్కువ సమయంలో 1500పైగా కళాశాలలకు అనుమతులు ఇవ్వడం సాధ్యమేనా?
కొత్త కోర్సులకు సిలబస్ ఖరారుపై మల్లగుల్లాలు
విద్యా సంబంధ విషయాల్లో ఉన్నత విద్యా మండలి, వర్సిటీల పాత్ర కట్టడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్య గందరగోళంలో పడింది. ప్రభుత్వ నిర్లక్ష్య విధానం విద్యార్థులను మానసికంగా కుంగదీస్తోంది. తాజాగా సంప్రదాయ డిగ్రీ విద్యలో ఆన్లైన్లో ప్రవేశాలకు మంగళం పలికేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. దీనికోసమే... 2 వారాల కిందట ఉన్నత విద్యా మండలి ఆన్లైన్ ప్రవేశాల్లో సాంకేతిక తోడ్పాటు కోసం వివిధ సంస్థల నుంచి ఫైనల్ బిడ్లను ఓపెన్ చేస్తే వాటిని నిలిపేసింది. ఏ నిర్ణయాన్ని ప్రకటించకుండా ప్రవేశాలను గాల్లో పెట్టింది.
ఇదంతా పారదర్శక ఆన్లైన్ విధానాన్ని ఎత్తేసి మాన్యువల్గా ప్రవేశాలు చేపట్టే ఉద్దేశంగా కనిపిస్తోంది. అదే జరిగితే డిగ్రీ ప్రవేశాల్లో భారీ అవకతవకలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. కళాశాలలు అక్రమ మార్గాల్లో ప్రవేశాలు చేపట్టే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఇలాంటి అక్రమ మార్గాలకు అడ్డుకట్ట వేసేందుకే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని తీసుకొచ్చింది. కూటమి సర్కారు కమీషన్ల కక్కుర్తి, ప్రజాధనాన్ని కాజేసే ఉద్దేశంతో దానికి మంగళం పాడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డిగ్రీపై తలో మాట..
కూటమి ప్రభుత్వంలో డిగ్రీ విద్యలో తలో మాట వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో, అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను ఒక నిర్దిష్ట సబ్జెక్టులో నిపుణుడిగా తీర్చిదిద్దే సింగిల్ మేజర్ను కాదని డ్యుయల్ మేజర్ పద్ధతిని తీసుకొస్తామని ప్రకటించింది. దీన్ని విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఉభయ సభల్లో పదేపదే ప్రస్తావించారు. ఈ తరుణంలో ఉన్నత విద్యా మండలి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సింగిల్ మేజర్లో స్వల్ప మార్పులు చేస్తూ డ్యుయల్ మేజర్లోని క్రెడిట్లు, కోర్సులు, సబ్జెక్టుల వారీగా వివరాలను వెల్లడించింది.
నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనికి 1,500కు పైగా కళాశాలలు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. డ్యుయల్ మేజర్పై ప్రభుత్వం సందేహాలు వ్యక్తం చేస్తూ నోట్ అడగడంతో ఉన్నత విద్యా మండలి సమాచారం అందించింది. కానీ, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తోంది. ఫలితంగా విద్యా సంవత్సరం ప్రారంభమైనా కళాశాలలకు అనుమతుల మంజూరు నిలిచిపోయింది.
ఉత్సవ విగ్రహంలా ఉన్నత విద్యా మండలి
విద్యా సంబంధ విషయాల్లో ఉన్నత విద్యా మండలి, వర్సిటీలదే కీలక పాత్ర. గతంలో ఎన్నడూ ప్రభుత్వాలు జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. కూటమి సర్కారు పాలనలో వ్యవస్థల్లో మితిమీరిన రాజకీయ, అధికార జోక్యం కారణంగా విద్యా రంగం కుంటుపడుతోంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైంది. డిగ్రీ తొలి ఏడాది ప్రవేశాలు ముగిశాక జూలై చివరి, ఆగస్టు తొలి వారంలో తరగతుల నిర్వహణకు తేదీలు ఖరారు చేస్తారు. కానీ, ప్రవేశాల విధానంపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం, డిగ్రీలో ఏ విధానాన్ని కొనసాగిస్తారో స్పష్టం చేయకపోవడంతో మొత్తం గందరగోళంగా తయారైంది.
» నెల రోజుల వ్యవధిలో 1,500కుపైగా కళాశాలల వివరాలను పరిశీలించి అనుమతులు ఇవ్వడం, కొత్త కోర్సుల కరిక్యులమ్ సిద్ధం చేయడం వంటి ప్రక్రియలు ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఓఎస్డీనే... షాడో మంత్రి!
విద్యాశాఖ వ్యవహారాలు మంత్రి లోకేశ్ కంటే ఆయనకు షాడోగా వ్యవహరిస్తున్న ఓఎస్డీ ఆకుల వెంకటరమణకే బాగా తెలుసని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి లోకేశ్ అవగాహన రాహిత్యం అనేక సార్లు బయటపడింది. మరోవైపు ఎవరైనా విద్యా వ్యవస్థలో తమ సమస్యలు చెప్పుకునేందుకు మంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి. ఎంతటి వారైనా ఓఎస్డీని కలవాల్సిందే.. వినతి పత్రాలు ఆయనకే ఇవ్వాల్సిందే. కాలేజీల అసోసియేషన్లు సైతం మంత్రి దర్శనం లేక ఎన్నో సార్లు సచివాలయం చూట్టూ ప్రదక్షిణలు చేసి వెళ్లిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అలాంటి ఓఎస్డీ ఉన్నత విద్యలో నిర్ణయాల అమలును శాసించే స్థాయికి వచ్చేశారు. గతంలో రాష్ట్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్) సైతం సదరు ఓఎస్డీ పని చేసిన ప్రదేశాల్లో అవినీతిలో మునిగితేలారని, డబ్బుల వసూళ్లలో తలపండిపోయినట్టు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ మంత్రి సదరు ఓఎస్డీని కొనసాగిస్తుండటం వెనుక పెద్ద మర్మమే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల విద్యాశాఖలో అత్యంత పాదర్శకంగా జరిగాయని చెప్పుకుంటున్న బదిలీల్లోనూ చక్రం తిప్పినట్టు వినికిడి.
» ఓఎస్డీ కొందరు అధికారులతో కలిసి ఉన్నత విద్యామండలి అధికారాలకు కత్తెర వేసేందుకు ప్లాన్ వేసినట్టు సమాచారం. ఉన్నత విద్యా మండలిని అకడమిక్ వ్యవహారాలకే పరిమితం చేసి, ప్రవేశాల నిర్వహణ, కళాశాలలకు అనుమతుల జారీ అంశాలను తమ చేతుల్లో పెట్టుకుని భారీగా దండుకునేందుకు ఎత్తుగడ వేశారు. అందుకే విద్యా సంబంధ విషయాల్లో మండలి భాగస్వామ్యాన్ని తగ్గిస్తూ.. దాని ప్రతిపాదనలకు పదేపదే మోకాలొడ్డుతూ వచ్చారు.
కీలక విద్యా సంబంధ కార్యక్రమాలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ను ఆహ్వానించడమే మానేశారు. గతంలో ఇదే ప్రభుత్వం ఎన్ఐటీకి చెందిన విద్యావేత్తను ఉన్నత విద్యా మండలికి చైర్మన్గా నియమించామని గొప్పలు చెప్పుకొంది. తీరాచూస్తే మండలి, ప్రభుత్వానికి సమన్వయం లోపించింది. దీంతో విద్యా వ్యవస్థ దిగజారుతోంది. తన శాఖలో ఇంత జరుగుతుంటే మంత్రికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేకపోవడం గమనార్హం!