
( ఫైల్ ఫోటో )
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సఖినేటిపల్లి మండలం కేశవదాసు పాలెం బెల్లంకొండవారి మెరక సమీపంలో గ్యాస్ లీక్ అవుతోంది. కొత్తగా వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తరచూ అక్కడే ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇళ్ల మధ్యలో గ్యాస్ లీక్ అవ్వడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఓఎన్జీసీ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.
గత ఏడాది.. యానాం దరియాలతిప్ప వద్ద గౌతమీ నది(గోదావరి)లో ఓఎన్జీసీ పైపు లైన్ లీక్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాల్లో గతంలోనూ ఇలాంటి గ్యాస్ లీక్ కారణంగా భారీ నష్టమే జరిగిందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.