పాలిసెట్‌ ఎంట్రన్స్‌కు ఫ్రీ కోచింగ్‌ | Free Coaching for Polyset Entrance | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ ఎంట్రన్స్‌కు ఫ్రీ కోచింగ్‌

Apr 21 2023 5:02 AM | Updated on Apr 21 2023 5:02 AM

Free Coaching for Polyset Entrance - Sakshi

సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవే­శా­నికి సంబంధించిన పాలిసెట్‌–2023 ఎంట్రన్స్‌ టెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

పాలిటెక్నిక్‌ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై పదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పాలిసెట్‌ తొలివిడత కోచింగ్‌ ఈ నెల 17న ప్రారంభించగా.. 24వ తేదీ నుంచి మరో బ్యాచ్‌ ప్రారంభిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందిన ప్రతి విద్యారి్థకి ఇంగ్లి‹Ù, తెలుగు మీడియంలలో ఉచిత స్టడీ మెటీరియల్‌ కూడా అందిస్తున్నారు.
 
మే 10న పాలిసెట్‌ 
మే 10న రాష్ట్రవ్యాప్తంగా 61 పట్టణాల్లోని 410 కేంద్రాల్లో పాలిసెట్‌–2023 నిర్వహిస్తున్నామని నాగరాణి పేర్కొన్నారు. పరీక్షకు సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన టెన్త్‌ సిలబస్‌ నుంచి గణిత శాస్త్రంలో 50 మార్కులు, భౌతిక శాస్త్రంలో 40 మార్కులు, రసాయన శాస్త్రంలో 30 మార్కులు మొత్తం కలిపి 120 మార్కులకు రెండు గంటల కాల పరిమితిలో పరీక్ష ఉంటుంద­న్నారు.

ప్రవేశ పరీక్షకు హాజరయ్యే ఓసీ, బీసీ విద్యా­ర్థులు రూ.400, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు రూ.100 ప్రవేశ రుసుమును సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో లేదాhttps:// polyce­tap.­nic.in  వెబ్‌సైట్‌ ద్వారా ఏప్రిల్‌ 30వ తేదీ సాయంత్రం 5గంటల లోపు చెల్లించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 176 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌లతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభిస్తున్న బేతంచర్ల (నంద్యాల జిల్లా), మైదుకూరు (కడప జిల్లా), గుంతకల్లు (అనంతపురం జిల్లా) ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు పొందగలుగుతారని వివరించారు.

బాలికల కోసం ప్రత్యేకంగా 10 ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లు, 2 మైనారిటీ పాలిటెక్నిక్‌లు.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం 9 ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు.

స్కాలర్‌ షిప్‌ సదుపాయమూ ఉంది
అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.50 వేల చొప్పున మూడు సంవత్సరాల ప్రగతి స్కాలర్‌ షి ప్‌ లభిస్తుందని నాగరాణి పేర్కొన్నారు. పాలిసెట్‌–2023 ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ స్కాలర్‌ షిప్‌ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్‌ నంబర్లు 08645293151, 7901620551/­557/567లలో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement