సాక్షి, విజయవాడ: మాజీ ఎంపీ కేశినేని నాని జాతీయమానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. విజయవాడలో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సోమవారం ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే తన స్నేహితుడైన తానినేని రాంబాబుపై పోలీసులు తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే రాంబాబు, ఆయన తల్లిని పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని సిటీ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవలే కంటి ,గుండె సంబంధింత ఆపరేషన్ చేయించుకున్న రాంబాబును విచారణపేరుతో 11గంటల పాటు అక్రమంగా పటమట పోలీస్ స్టేషన్లో నిర్భంధించారని పేర్కొన్నారు.
ఈనెల 5వ తేదీన రాంబాబు కంటి ఆపరేషన్ చేయించుకొని డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటుండగా పోలీసులు కనీస మానవత్వం సైతం లేకుండా వరుసగా మూడు రోజులు 6,7,8 ఆయనను పోలీసు స్టేషన్లో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి పోలీసులు వ్యవహరిస్తున్నారని పోలీసుల చర్యలతో ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉన్న నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్ను సంప్రదించినట్లు పేర్కొన్నారు.


