కృష్ణా జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని అన్నారు. పవన్ రాజకీయ జీవితమంతా పొంతనలేని మాటలేనని ఎద్దేవా చేశారు. పవన్ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడనుకుంటున్నారని చెప్పారు.
కృష్ణా జిల్లాలో పేర్నినాని ఆదివారం మాట్లాడుతూ.. ‘‘పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలను కల్లబొల్లి కబుర్లతో నమ్మించాలని చూస్తున్నాడు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారనే భావనలోనే పవన్ మీటింగ్ సాగింది.
పవన్ మాటలకు పొంతన లేదు. 2019-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఎన్ని అసత్యాలు మాట్లాడారో మర్చిపోయారా? అప్పట్లో 175 చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేని మీకు జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా? పవన్ రాజకీయ జీవితమంతా పొంతనలేని మాటలే. రాష్ట్రం బాగు కోసం కూటమిలో చేరానంటాడు.
జనసేన కార్యకర్తల బాధలను చూస్తూ సహించనంటాడు. బందరులో లంచాలు ఇవ్వలేదని జనసేన కార్యకర్త ఇల్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లారు పవన్? కనీసం కొల్లు రవీంద్రకు ఫోన్ చేసి బుద్దిలేదా అని అడిగారా? ఎంతమంది జనసేన కార్యకర్తలను తంతున్నారో మీకు తెలుసా?
జనసేన కార్యకర్తల బాధలు పగోడికి కూడా వద్దు. మహారాష్ట్ర వెళ్లి ప్రచారం చేసొస్తే 95 శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందంటున్నారు. ఏపీలో మీరు వంద శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. వంద శాతం స్ట్రైక్ రేట్ వచ్చినోళ్లలో గెలిచిన వారు ఎవరు... ఏరోజైనా మీ పార్టీ జెండా మోశారా?
చంద్రబాబు జనసేన అని మెడలో వేసిన వాళ్లకే కదా మీరు సీట్లిచ్చింది? సీజ్ ద షిప్ అని నాలుగైదు రోజులు కూడా ఆపలేకపోయారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో సీజ్ ద షిప్ అని నాలుగు రోజులు కూడా ఆపలేకపోయామని మీరే ఒప్పు కుంటున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటికి రాగానే రోడ్డు మ్యాప్ వచ్చిందన్నారు. 2020లోనే ఇప్పటం సభలో ఓట్లు చీలనివ్వనని చెప్పింది మీరే’’ అని చెప్పారు.


