సాక్షి, గుంటూరు: ఏపీలో ‘మావిగన్’కు మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘‘రావాలి జగన్- కావాలి మావిగన్’ పేరుతో తాడేపల్లి జాతీయ రహదారి సమీపంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మావిగన్ ఏపీ గ్రోత్ ఇంజిన్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మావిగన్తోనే సాధ్యం. ఏపీ త్వరగా అభివృద్ధి చెందాలంటే ‘మావిగన్’ కావాలి. మన రాజధాని- మన మావిగన్- మన ఆంధ్రప్రదేశ్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మావిగన్ వల్ల ప్రయోజనాలు వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
వైఎస్ జగన్ ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) ఆలోచన రాష్ట్రమంతా చర్చకు దారితీసింది. ఇది అత్యంత వాస్తవికమైన ఆలోచన అని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఒక ఆచరణాత్మకమైన పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ప్రజలకు సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతోనే.. తక్కువ ఖర్చుతో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను నాడు రాజధానిగా ప్రతిపాదించానని చాలా స్పష్టంగా, అరమరికలు లేకుండా వైఎస్ జగన్ వివరించిన తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించి.. చంద్రబాబు చెబుతున్న దానిలో కేవలం పది శాతం పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెంది.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన ఆచరణాత్మకమైనదని, రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి భారం లేనిదంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.



