పొగాకు ధర పెరుగుదలపై హర్షాతిరేకాలు
దేవరపల్లి: మార్కెట్లో గత నెల రోజుల నుంచి క్రమేపీ పొగాకు ధరలు పెరగడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల్లో రూ.63 పెరిగి శుక్రవారం కిలోకు గరిష్ట ధర రూ.328 లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. దీనికి కృతజ్ఞతగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, గోపాలపురం పొగాకు వేలం కేంద్రాల పరిధిలోని పలువురు రైతులు దేవరపల్లి వేలం కేంద్రం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వల్లభనేని సత్యనారాయణ మాట్లాడుతూ గత నెల ఐదో తేదీన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా దేవరపల్లి వేలం కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. జగన్ పర్యటనకు ముందు కిలో రూ.265గా ఉన్న ధర శుక్రవారం నాటికి రూ.328కు చేరిందని ఆనందం వ్యక్తం చేశారు.
రైతులకు కష్టకాలంలో వైఎస్ జగన్ అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. జగన్ అడుగుపెడితే ధర పెరుగుతుందనే నమ్మకం నిజమైందన్నారు. ఈ కార్యక్రమంలో పొగాకు రైతు సంఘం ప్రతినిధులు సుంకవల్లి శ్రీనివాస్, నరహరిశెట్టి రాజేంద్రబాబు, రైతులు కూచిపూడి సతీష్, గన్నమని జనార్ధనరావు, ముల్లంగి శ్రీనివాసరెడ్డి, కుసులూరి వెంకట సతీష్ తదితరులు పాల్గొన్నారు.


