
విశాఖలోని డాబా గార్డెన్స్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు
విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహ నిర్వహణను ప్రైవేటుకిస్తే ఊరుకోం
దీనిని కూడా నిర్వహించలేకపోతే ఇంకేం పరిపాలిస్తావ్ చంద్రబాబూ?
వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేడ్కర్ జయంతి
నివాళుర్పించిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
సాక్షి, అమరావతి/గాందీనగర్(విజయవాడ సెంట్రల్)/డాబాగార్డెన్స్(విశాఖపట్నం): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే గొప్ప సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం విజయవాడలో 125 అడుగుల ఎత్తులో సామాజిక, న్యాయ మహా శిల్పాన్ని నిర్మిస్తే.. కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ స్మృతులను చెరిపేసేందుకు కుట్ర పన్నిందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.
అంబేడ్కర్ చిత్రపటం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. విజయవాడలోని డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహంపై కూటమి ప్రభుత్వం విషం చిమ్ముతోందని మండిపడ్డారు. ఆ మహానుభావుడి విగ్రహంతో చంద్రబాబు వ్యాపారం చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. దళితులపై బాబు సర్కార్ అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరే అని పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు వైఎస్ జగన్ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహం జోలికి వెళ్లావో తగిన గుణపాఠం తప్పదని చంద్రబాబును హెచ్చరించారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు అడుగులు వేద్దామన్నారు.
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి దశ, దిశ చూపించిన అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దామన్నారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి బాటలు వేసిన మహానుభావుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, షేక్ ఆసిఫ్, వేల్పుల రవికుమార్, చంద్రశేఖర్రెడ్డి, నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
సామాజిక, న్యాయ మహా శిల్పం వద్ద ఘనంగా జయంతి
విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ సామాజిక, న్యాయ మహా శిల్పం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుక ఘనంగా జరిగింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, నాయకులు గౌతంరెడ్డి, శైలజారెడ్డి, బెల్లం దుర్గ, షేక్ ఆసిఫ్, ఎ.రవిచంద్ర, దొడ్డా అంజిరెడ్డి, పోతిన మహేశ్, ఎస్సీ సెల్ నాయకులు కాలే పుల్లారావు, శరత్ తదితరులు అంబేడ్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు.
ఇక రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తావ్?
విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని చంద్రబాబు.. రాష్ట్రాన్ని ఇంకేం పరిపాలిస్తారని రాజ్యాసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు రవీంద్రబాబు, వరుదు కల్యాణి ప్రశ్నించారు. మీకు చేతకాకపోతే మాకివ్వండి.. మేమే అంబేడ్కర్ స్మృతివనాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
సోమవారం విశాఖలోని డాబా గార్డెన్స్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో లేకుండా చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దళితులను వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివరామకృష్ణ, నాయకులు బొల్లవరపు జాన్వెస్లీ, ద్రోణంరాజు శ్రీవత్సవ్ పాల్గొన్నారు.