
సాంకేతిక విద్యాశాఖ బదిలీల్లో సర్దుబాటు, డెప్యుటేషన్లకు అధికారుల కొత్త భాష్యం
ఏజెన్సీ, గ్రామీణ నేపథ్య కాలేజీల్లోని వారికి మొండిచేయి
ముడుపులిచ్చిన వారికి మైదాన ప్రాంతాల్లో ఉండేలా నిబంధనలు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ బదిలీల్లో సాంకేతిక విద్యాశాఖ కొత్త భాష్యం చెబుతోంది. పలుకుబడి ఉన్నవారికి, ముడుపులిచ్చిన వారికి అనుకూలంగా బదిలీ మార్గదర్శకాలు రూపొందించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి పట్టణాల్లో పనిచేసే సిబ్బందికే మేలుచేసేలా ఉన్నాయని.. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోని పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న వారు పట్టణాలకు వచ్చే వీల్లేకుండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కమిటీల సూచనల మేరకు ‘0’ నుంచి 5 ఏళ్ల సర్వీసు ఉన్నవారిని బదిలీచేస్తున్నారు. ఇందుకోసం శాఖల్లోని ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ వేసి అందుకనుగుణంగా మార్గదర్శకాలు రూపొందిస్తారు. కానీ, సాంకేతిక విద్యాశాఖలో మాత్రం అందుకు భిన్నంగా కొందరు కిందిస్థాయి సిబ్బంది సూచనలతో రెండేళ్లు సర్వీసు దాటిన వారిని బదిలీ చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించారు.
దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు ప్రభుత్వ కార్యదర్శికి ఫిర్యాదులు వెళ్లడంతో వాటిని రద్దుచేశారు. దీంతో.. కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. అయితే, ఇవి కూడా అయినవారికి మేలు చేసేలాగే ఉన్నాయని పలువురు ఉద్యోగులు, అధ్యాపకులు ఇటీవల డైరెక్టరేట్కు వచ్చి నిలదీసినట్లు తెలిసింది.
డెప్యుటేషన్లు అడ్డంపెట్టుకుని ఆటలు..
ఉద్యోగుల బదిలీల్లో వారు పనిచేస్తున్న ప్రాంతాలను ఫొకల్ (పట్టణం), నాన్–ఫోకల్ (గ్రామీణ/ఏజెన్సీ)గా పేర్కొంటారు. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఏడాదికి 3 పాయింట్లు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి 4 పాయింట్లు బదిలీల్లో కేటాయిస్తారు. అవసరాన్నిబట్టి పని సర్దుబాటుపైనా, డెప్యుటేషన్ పైనా సిబ్బందిని ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు అధికారులు పంపిస్తారు.
అయితే, ఈ సర్దుబాటు సాంకేతిక విద్యాశాఖలో విచిత్రంగా జరుగుతోంది. నాన్–ఫోకల్కు బదిలీ అయిన వారిలో కొందరు తమ పలుకుబడిని ఉపయోగించి ఫోకల్ ప్రాంతాలకు డెప్యుటేషన్ వేయించుకుంటున్నారు. ఇందుకోసం ఫోకల్లో ఉన్న వారిని వర్క్ అడ్జెస్ట్మెంట్పై నాన్–ఫోకల్ ప్రాంతానికి పంపిస్తున్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లోని కాలేజీల్లో పోస్టులు వచ్చిన వారు ఫోకల్ (పట్టణ) ప్రాంతాల్లోకి వర్క్ అడ్జెస్ట్మెంట్, డెప్యుటేషన్పై వచ్చి పనిచేస్తున్నారు. ప్రస్తుత బదిలీల్లో వీరు ఏజెన్సీ పాయింట్లు పొందుతున్నారు.
వేతనం పొందే ప్రాంతం ఆధారంగా నిబంధనలు..
ఇక తమను పట్టణ ప్రాంతాల్లో (ఫోకల్) పోస్టింగ్ ఇచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో డెప్యుటేషన్ వేశారని, కొన్నేళ్లుగా తాము అక్కడే పనిచేస్తున్నందున తమను నాన్–ఫోకల్గా గుర్తించాలని ఆ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ, వారి విజ్ఞప్తులను పట్టించుకోకుండా జీతం పొందుతున్న ప్రాంతం ఆధారంగా పాయింట్లు కేటాయించేందుకే డైరెక్టరేట్ నిబంధనలను ఖరారు చేసినట్లు చెబుతున్నారు.
దీనివల్ల తాము నష్టపోతామని, ఇప్పటికే నాన్–ఫోకల్లో డెప్యుటేషన్పై పనిచేస్తున్న తాము బదిలీల్లో మరి కొన్నేళ్లు ఇక్కడే పనిచేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవంగా పనిచేస్తున్న ప్రాంతాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
స్కూలు అసిస్టెంట్లకు తప్పనిసరి బదిలీ..
మరోవైపు.. ప్రభుత్వ పాఠశాల విద్యను తిరోగమనంలోకి నెట్టేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయ (ఎంపీఎస్ హెచ్ఎం) పోస్టుల్లోకి మరికొందరిని తప్పనిసరిగా బదిలీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డీఈఓలను ఆదేశించింది. చట్టానికి, ఉపాధ్యాయ నియామక నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చిన ఈ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తున్న సంగతి తెలిసిందే.
గత ప్రభుత్వంలో 3–5 తరగతుల విద్యార్థులకు మెరుగైన బోధన కోసం సబ్జెక్టు టీచర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తే.. కూటమి ప్రభుత్వం వారిని తొలగించింది. అంతేగాక.. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఉన్నత తరగతుల విద్యార్థులకు సైతం స్కూల్ అసిస్టెంట్ల బోధనను రద్దుచేసింది. ఇలా మిగులుగా తేలిన 4,693 మంది స్కూల్ అసిస్టెంట్లను బోధనకు దూరంచేసి ఎంపీఎస్ హెచ్ఎంలుగా నియమిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో మొత్తం 3,781 మంది ఎస్ఏలను ఎంపీఎస్ హెచ్ఎంలుగా బదిలీచేశారు.
మరో 912 మందిని ఈ పోస్టుల్లో నియమించాల్సి ఉంది. ఈ క్రమంలో.. మిగిలిన ఈ పోస్టుల్లో డీఎస్సీ–2025 వారికి 415 పోస్టులు కేటాయించారు. మరో 461 పోస్టుల్లో ఎస్జీటీలకు పదోన్నతులిచ్చి నియమిస్తారు. మిగిలిన 36 పోస్టుల్లో తప్పనిసరిగా స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
వాస్తవానికి.. ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులను ఎస్జీటీలకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతిపై భర్తీచేస్తారు. కానీ, ఎన్నడూలేని విధంగా సబ్జెక్టు టీచర్లయిన స్కూల్ అసిస్టెంట్లను పీఎస్ హెచ్ఎం పోస్టుల్లో నియమిస్తున్నారు. దీంతో తమ పరిస్థితి ఏంటో అర్ధంగాక స్కూల్ అసిస్టెంట్లు ఆందోళన చెందుతున్నారు.
టెక్నికల్గా ఎన్ని విచిత్రాలో..
» ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, రంపచోడవరం, కేఆర్పురంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 2014 నుంచి పూర్తిస్థాయిలో పోస్టుల్లేవు. దీంతో మైదాన ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని పాలిటెక్నిక్ కాలేజీల సిబ్బందిని డెప్యుటేషన్, వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద బదిలీ చేశారు. కొన్నేళ్లుగా వారు ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్నా వేతనం మాత్రం పోస్టింగ్ ఇచ్చిన పట్టణ కాలేజీల నుంచి పొందుతున్నారు. దీంతో వీరికి ఫోకల్ కింద ఏడాదికి 3 పాయింట్లే వస్తున్నాయి.
» కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో పోస్టింగ్ వచి్చన ఒకరు డెప్యుటేషన్పై కాకినాడ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పోస్టింగ్ వేయించుకున్నారు. ఈయనకు నాన్–ఫోకల్ కింద ఏడాదికి 4 పాయింట్లు పొంది బదిలీల్లో తిరిగి ఫోకల్కే వెళ్లే అవకాశం ఉంది.
» అలాగే, రాయలసీమలోని ఓ ఐటీడీఏ పరిధిలోని గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీలో పోస్టింగ్ పొందిన ఓ ఉద్యోగి కొద్దిరోజులకే రాష్ట్ర కార్యాలయానికి డెప్యుటేషన్ వేయించుకున్నారు. కానీ, ప్రస్తుత బదిలీల్లో ఆయనకు ఏజెన్సీ పాయింట్లు పొంది తిరిగి ఫోకల్ ప్రాంతానికి వెళ్లే ఛాన్స్ తెచ్చుకున్నారు.
» మరికొందరు ఉద్యోగులు విజయవాడ ప్రసాదంపాడులోని డైరెక్టరేట్ ఉన్న సమయంలో కొన్నేళ్లు పనిచేశారు. డైరెక్టరేట్ తాడేపల్లికి మారే క్రమంలో విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీకి పోస్టింగ్ వేయించుకున్నారు. దీంతో వారి స్టేషన్ మారిందని చెప్పి ప్రస్తుత బదిలీ తమకు వర్తించదని చెబుతున్నారు. ఇలాంటి చిత్రాలెన్నో సాంకేతిక విద్యాశాఖలో జరుగుతున్నాయి. రెండు మూడ్రోజుల్లో బదిలీలు చేపట్టనున్న క్రమంలో వర్క్ అడ్జెస్ట్మెంట్, డెప్యుటేషన్పై నాన్–ఫోకల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి న్యాయం చేస్తారా.. లేక పలుకుబడి ఉన్నవారికే ఫోకల్ పోస్టింగ్స్ ఇస్తారా అన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది.