అనుమతుల్లేకుండానే నేలమట్టం.. సామగ్రి దోచుకుపోయిన వైనం
కాకినాడ జిల్లా యండమూరులో టీడీపీ కూటమి నేతల దురాగతం
మరోవైపు అధికారం ఉందనే కండకావరంతో టీడీపీ కూటమి నేతలు చెలరేగిపోయారు. కాకినాడ జిల్లా కరప మండలం యండమూరులో ఆరోగ్య ఉపకేంద్రాన్ని కూల్చావే
శారు. విలువైన సామగ్రి ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనలు రాష్ట్రంలో బాబు అసమర్థ పాలనకు అద్దం పడుతున్నాయి.
కరప: కాకినాడ జిల్లా కరప మండలంలో టీడీపీ కూటమి నాయకులు అధికారమదంతో చెలరేగిపోతున్నారు. తాజాగా ఆదివారం సెలవు రోజున యండమూరు గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని అనుమతుల్లేకుండా కూల్చేశారు. భవనంలోని సామగ్రిని దోచుకుపోయారు. కూటమి నాయకుల దురాగతాన్ని చూసి గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. వేళంగి పీహెచ్సీ పరిధిలో ఉండే యండమూరులోని ప్రజలకు ఆరోగ్య సేవలందించేందుకు చెరువు గట్టున భవనాన్ని నిర్మించి ఏఎన్ఎంను నియమించి ఆరోగ్య సేవలందిస్తున్నారు.
కొంతకాలంగా ఆ భవనం పాడవ్వడంతో అద్దె ఇంటిలో ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో కూటమి నాయకులు ఎవరి అనుమతీ తీసుకోకుండానే, అధికారం ఉంది, తమను ఎవరు ఆపుతారనే అహంకారంతో ఆదివారం సెలవు రోజున చెరువు గట్టున ఉన్న భవనాన్ని కూల్చేసి, కిటికీలు, గుమ్మాల సామగ్రిని దోచుకుపోయారు.
ఈ నెల మొదటి వారంలో జరిగిన గ్రామసభలో కూడా భవనాన్ని కూల్చాలంటే డీఎంఅండ్హెచ్ఓ అనుమతి తీసుకుని, వేలం పాట నిర్వహించి తొలగించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేసినా వారి మాటలు ఖాతరు చేయలేదు. విషయం తెలుసుకున్న పీహెచ్సీ డాక్టర్ అనూష గ్రామ ప్రత్యేకాధికారి, డీఎంఅండ్హెచ్ఓలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పీహెచ్సీ వైద్యాధికారిణికి ఫోన్చేసి తనను కలవాలని ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై అధికారులు, ఎమ్మెల్యే ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.


