భీమిలిలో డిఫెన్స్‌ ఎంఎస్‌ఎంఈ పార్కు

Defense MSME Park in Bheemili - Sakshi

2 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు రాయితీలు 

ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రెండు సంస్థలు 

డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో మంచి అవకాశాలు 

మేక్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ వర్క్‌షాప్‌లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

మధురవాడ(భీమిలి): భీమిలి నియోజకవర్గంలో డిఫెన్స్‌ ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. రుషికొండ సమీపంలోని రాడిసన్స్‌ బ్లూ హోటల్‌లో సోమవారం నిర్వహించిన ‘దేశీ–2021 ఆంధ్రప్రదేశ్‌’ వర్క్‌షాప్‌నకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉందని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో  సంస్కరణలు చేపట్టి సమర్ధవంతమైన పాలన అందిస్తోందన్నారు.   

కరోనా కాలంలోనూ రాయితీలు 
కరోనా కష్టకాలంలోనూ టెక్స్‌టైల్‌ రంగానికి రూ.600 కోట్ల ప్రోత్సాహకాలతోపాటు ఎంఎస్‌ఎంఈ పార్కులకు సంబంధించి..రూ.వెయ్యి కోట్ల గత ప్రభుత్వ బకాయిలు  చెల్లించామని వెల్లడించారు. ఐటీ పరిశ్రమలకు సంబంధించిన బకాయిలు రూ.30 కోట్లు ఉన్నాయని వాటిని, ఈ ఏడాది చెల్లిస్తామని చెప్పారు. ఈ –గవర్నెన్స్, ఇంటర్నెట్‌ వంటి అంశాల్లో భవిష్యత్‌లో దేశంలోనే ఏపీ బెస్ట్‌ అనిపించుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  

2 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు.. 
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించిందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ప్రారంభించాలని నిర్ణయించారని చెప్పారు. 2 వేలు పైబడి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు కస్టమ్స్‌ సహా పలు రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు.  

ఏపీ ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ 
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్రం ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీగా నిలుస్తోందని మంత్రి మేకపాటి తెలిపారు. కొత్త పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు ఎటువంటి అవాంతరాలు ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పెట్టుబడిదారుల అనుకూల విధానాలతో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్స్‌ సొసైటీ(ఏపీఐఎస్‌).. అరŠాత్యన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఏపీఈఐటీఏ–నేషనల్‌ రీసెర్చ్‌ డిజైన్‌ కార్పొరేషన్ల మధ్య మంత్రుల సమక్షంలో అవగాహన ఒప్పందాలు జరిగాయి.  ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, వర్చువల్‌గా డీఆర్డీవో చైర్మన్‌ సతీష్‌రెడ్డి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top