Cyclone Gulab: ‘గండం’ దాటింది

Cyclone Gulab Crosses Coast Near Kalingapatnam In AP - Sakshi

కళింగపట్నం సమీపంలో తీరం దాటిన ‘గులాబ్‌’..

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా జోరు వానలు

ఉత్తరాంధ్రలో ఉప్పొంగుతున్న నాగావళి, వంశధార

నేడు, రేపు భారీ వర్ష సూచన 

కొత్త బోటులో మత్స్యకారులు ఒడిశా నుంచి వస్తుండగా బోల్తా

ఐదుగురు సురక్షితం.. ఒకరి కోసం కొనసాగుతున్న గాలింపు

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు

ముందస్తు జాగ్రత్తలతోపాటు సహాయ చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం

తొలిసారి సచివాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు

రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, సాక్షి, అమరావతి, మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్రకు కునుకు లేకుండా చేసిన గులాబ్‌ తుపాను కొద్ది గంటలు ముందుగానే ఆదివారం రాత్రి కళింగపట్నం–గోపాలపూర్‌ మధ్య తీరం దాటింది.  సాయంత్రం 6.30 గంటల సమయంలో తీరాన్ని తాకిన తుపాన్‌ అనంతరం కళింగపట్నానికి పశ్చిమంగా ఒడిశా వైపు పయనిస్తూ తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కుంభవృష్టితో తుపాను ప్రభావం తీవ్రంగా కనిపించింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో తీరం వెంట గంటకు 80–90 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గులాబ్‌ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  జోరు వర్షాలతో నాగావళి పరవళ్లు తొక్కుతోంది. తోటపల్లి ప్రాజెక్ట్‌ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మడ్డువలస వద్ద కూడా అదే పరిస్థితి ఉంది. హిర మండలం గొట్టాబ్యారేజీ వద్ద వంశధారలో నీటి ప్రవాహం పెరగడంతో 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో భారీ వర్షానికి జలమయమైన రహదారి 

చివరిలో నెమ్మదించి.. 
శ్రీకాకుళం జిల్లాను వణికించిన గులాబ్‌ ఆఖరులో శాంతించింది. తిత్లీ సమయంలో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో రాకాసి గాలులు వీయగా హుద్‌హుద్‌ వేళ 215 కిలోమీటర్ల వేగంతో పెను తుపాన్‌ విరుచుకుపడింది. గులాబ్‌ మాత్రం 80–90 కిలోమీటర్ల వేగానికి పరిమితమైంది. రాత్రి తొమ్మిది నుంచి పది గంటల సమయంలో 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రహదారులకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

ఈ నెల 28న మరో అల్పపీడనం 
ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని  ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 28వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే సూచనలున్నాయని భావిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా గోపినాథపురం సమీపంలో రోడ్డుపై పడిన చెట్లను తొలగిస్తున్న సిబ్బంది   

శ్రీకాకుళం జిల్లాలో  40.4 మి.మీ సగటు వర్షపాతం  
ఆదివారం రాత్రి 8.30 నుంచి 10.30 గంటల మధ్య శ్రీకాకుళం జిల్లాలో 40.4 మి.మీ, విశాఖపట్నం జిల్లాలో 37.3 మి.మీ, విజయనగరం జిల్లాలో 26.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కళింగపట్నంలో 148.5 మి.మీ, ఎచ్చెర్లలో 109.5, అడవివరంలో 108, నిమ్మాడలో 96.5, తులుగులో 96.5, విశాఖ నగరంలో 93.3, నరసన్నపేటలో 78.3, రాగోలులో 77, తమ్మినాయుడుపేటలో 71.8, పొలాకిలో 71 మి.మీ వర్షం కురిసింది.

ఉత్తరాంధ్రకు వరద హెచ్చరిక 
ఆదివారం రాత్రి నుంచి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖ జిల్లాలోని అనేక చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఉభయగోదావరి జిల్లాల్లోను వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల వంశధార, మహేంద్ర తనయ నదులు పొంగి ప్రవహించే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది.

తుపాను కారణంగా విశాఖలోని పెదజాలరిపేట వద్ద ఒడ్డుకు చేర్చిన పడవలు  

పునరావాస కేంద్రాలకు తరలింపు.. 
శ్రీకాకుళం జిల్లాలో 38 పునరావాస కేంద్రాల్లోకి 1,358 మందిని తరలించారు. బందరువానిపేట జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 500 మందికి పునరావాసం కల్పించారు. వజ్రపుకొత్తూరు మండలంలో 182 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంచినీళ్లపేటలో 12 మందిని, బైపల్లి గ్రామంలో 54 మందిని, ఎల్‌డీపేటకు చెందిన 26 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మెట్టూరుకు చెందిన 65 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన సదుపాయాలు కల్పించారు. పూడిలంకలో 73 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు.

27 మండలాల్లో ‘గులాబ్‌’ ప్రభావం 
తుపాను దృష్ట్యా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. 27 మండలాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేసి యుద్ధప్రాతిపదికన పరికరాలు, సిబ్బందిని  తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. 276 ప్రైవేటు క్రేన్లు, 64 జనరేటర్లు అందుబాటులో ఉంచారు. 25,500 విద్యుత్‌ స్థంభాలు, 2,732 ట్రాన్స్‌ఫార్మర్లు స్టోర్‌లో ఉంచారు.

శ్రీకాకుళం జిల్లాలో 1400 మందితో 70 బృందాలు, విజయనగరం జిల్లాలో 700 మందితో 35 బృందాలు, విశాఖపట్నం జిల్లాలో 1440 మందితో 72 బృందాలను రంగంలోకి దించారు. కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసి 24 గంటలూ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. పర్యవేక్షణకు నోడల్‌ అధికారులను నియమించారు. తుపాను నేపధ్యంలో ఏపీఈపీడీసీఎల్‌ చేపట్టిన ఏర్పాట్లపై డిస్కం సీఎండీ కె.సంతోషరావుతో కలసి ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ సమీక్ష నిర్వహించారు. లైన్‌మెన్‌ నుంచి చైర్మన్‌ వరకూ ఎవరికీ సెలవులు ఉండవని, పునరుద్ధరణ పనులపై సీఎం జగన్‌ పర్యవేక్షణ ఉంటుందని, తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

బోటు బోల్తా.. ఐదుగురు సురక్షితం 
శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు ఒడిశా నుంచి కొత్త బోటు కొనుగోలు చేసి వస్తుండగా అక్కుపల్లి సమీపంలో గంగువాడ కొండ దగ్గర సముద్రంలో బోటు బోల్తాపడడంతో గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురు సురక్షితంగా అక్కుపల్లి, బాతుపురం ప్రాంతాల్లో తీరానికి చేరుకోగా గల్లంతైన బుంగ మోహన్‌రావు (18) కోసం గాలిస్తున్నారు.

ముందు జాగ్రత్త చర్యలతో..
తుపాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టింది. కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని గమనిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తొలిసారి తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశారు. వలంటీర్లను రంగంలోకి దించి ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూశారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో ఐదు, కంచిలి మండలంలో 3, ఇచ్ఛాపురంలో 3, పలాసలో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పోలాకి మండలం సముద్ర తీర ప్రాంతంలో పర్యటించారు. పశు సంవర్ధకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఎస్పీ అమిత్‌ బర్దార్‌ బారువ మండలం కొత్తూరు, సంతబొమ్మాళి మండలం సున్నపల్లి గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులకు జాగ్రత్తలు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు సూచించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top