
మా ఆదేశాలను ఎందుకు ఉల్లంఘించారో చెప్పండి
ఎస్పీ అశోక్కుమార్కు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఇ.జి.అశోక్ కుమార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఎందుకు ఉల్లంఘించారు? ఎందుకు కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని ఆయన్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వం బేఖాతర్
2020లో అప్పటి ప్రభుత్వం తనకు ఇచ్చిన 1+1 భద్రతను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్ కడప జిల్లా, వేముల గ్రామానికి చెందిన లింగాల రామలింగారెడ్డి ఈ ఏడాది ఏప్రిల్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్కు ఉన్న 1+1 భద్రతను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. అయినా రామలింగారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పునరుద్ధరించలేదు.
వైఎస్సార్సీపీకి మద్దతుదారు కావడంతోనే..
దీంతో రామలింగారెడ్డి జిల్లా ఎస్పీపై తాజాగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ గురువారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది టి.నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. రామలింగారెడ్డి కుటుంబం మొత్తం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉందని, వారంతా వైఎస్సార్సీపీ మద్దతుదారులని తెలిపారు. పిటిషనర్ వ్యాపారాలు చేస్తుంటారని పేర్కొన్నారు.
రాజకీయ, వ్యాపార కారణాల వల్ల శత్రువులు పెరగడంతో ఆయనకు ప్రాణహాని ఉందని, భద్రత కోసం ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారని వివరించారు. చివరకు ప్రభుత్వం 2020లో పిటిషనర్కు 1+1 భద్రతను కల్పించిందని, ఇదిలా ఉంటే 2024 జూలైలో ప్రభుత్వం అకస్మాత్తుగా పిటిషనర్ భద్రతను ఉపసంహరించిందని పేర్కొన్నారు.
హైకోర్టు పిటిషనర్ భద్రత పునరుద్ధరణకు ఆదేశాలిచ్చిందని, ఈ ఆదేశాలను ఎస్పీ ఉద్దేశపూర్వకంగా పెడచెవిన పెట్టారని వివరించారు. దీంతో న్యాయమూర్తి.. కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్కు కోర్టు ధిక్కారం నోటీసులు జారీ చేశారు.