కడప ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు | Contempt of court notices issued to Kadapa SP | Sakshi
Sakshi News home page

కడప ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు

May 31 2025 4:06 AM | Updated on May 31 2025 4:06 AM

Contempt of court notices issued to Kadapa SP

మా ఆదేశాలను ఎందుకు ఉల్లంఘించారో చెప్పండి 

ఎస్పీ అశోక్‌కుమార్‌కు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీ ఇ.జి.అశోక్‌ కుమార్‌కు హైకోర్టు నోటీ­సులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఎందుకు ఉల్లంఘించారు? ఎందుకు కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని ఆయన్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచార­ణను జూన్‌ 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  

హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వం బేఖాతర్‌ 
2020లో అప్పటి ప్రభుత్వం తనకు ఇచ్చిన 1+1 భద్రతను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాల్‌ చేస్తూ వైఎస్సార్‌ కడప జిల్లా, వేముల గ్రామానికి చెందిన లింగాల రామలింగారెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్‌కు ఉన్న 1+1 భద్రతను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్ర­భుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్ర­భుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీల్‌ దా­ఖలు చేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. అయినా రామలింగారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పునరుద్ధరించలేదు.  

వైఎస్సార్‌సీపీకి మద్దతుదారు కావడంతోనే.. 
దీంతో రామలింగారెడ్డి జిల్లా ఎస్పీపై తాజాగా కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ హరినాథ్‌ గురువారం విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది టి.నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. రామలింగారెడ్డి కుటుంబం మొత్తం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉందని, వారంతా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులని తెలిపారు. పిటిషనర్‌ వ్యాపారాలు చేస్తుంటారని పేర్కొన్నారు. 

రాజకీయ, వ్యాపార కార­ణాల వల్ల శత్రువులు పెరగడంతో ఆయనకు ప్రాణహాని ఉందని, భద్రత కోసం ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారని వివరించారు. చివరకు ప్రభుత్వం 2020లో పిటిషనర్‌కు 1+1 భద్రతను కల్పించిందని, ఇదిలా ఉంటే 2024 జూలైలో ప్రభు­త్వం అకస్మాత్తుగా పిటిషనర్‌ భద్రతను ఉప­సంహరించిందని పేర్కొన్నారు.

 హైకోర్టు పిటిషనర్‌ భద్ర­త పునరుద్ధరణకు ఆదేశాలిచ్చిందని, ఈ ఆదేశా­ల­ను ఎస్పీ ఉద్దేశపూర్వకంగా పెడచెవిన పెట్టారని వివరించారు. దీంతో న్యాయమూర్తి.. కడప జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌కు కోర్టు ధిక్కారం నోటీసులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement