
ఈ ఏడాది 45 రోజులు ముందుగానే గింజ దశ
ముందస్తు వర్షాలతో మేలు
ఈ ఏడాది అధిక దిగుబడిపై రైతుల ఆశలు
నాణ్యమైన ఆర్గానిక్ కాఫీ పంటగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన మన్యం కాఫీ తోటలకు ఈ ఏడాది అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి. ఎన్నడూలేని రీతిలో 45 రోజుల ముందుగానే ఈ తోటలు పిందెలతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి కురిసిన వర్షాలు అనుకూలించడంతో కాఫీ మొక్కలు విరగ్గాశాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ప్రస్తుతం ఏజెన్సీ వ్యాప్తంగా 1.55 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఏడాది కూడా మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశతో ఉన్నారు. – సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)
పోటా పోటీగా కొనుగోళ్లు
ఇక గత ఏడాది 1.48 లక్షల ఎకరాల్లో సుమారు 17 వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజల దిగుబడి వచ్చింది. జీసీసీతో పాటు ప్రైవేట్ సంస్థలు పోటాపోటీగా దీనిని కొనుగోలు చేశాయి. గిరిజన రైతులంతా కిలో పాచ్మెంట్ కాఫీ గింజలను రూ.450 ధరకు అమ్ముకున్నారు. బెంగళూరు మార్కెట్లో కిలో రూ.550 ధరతో వ్యాపారం జరిగింది. ప్రతీ రైతు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70వేల వరకు ఆదాయం పొందారు. ఈ ఏడాది అదనంగా మరో ఏడువేల ఎకరాల కొత్త తోటలకు తొలిసారిగా కాపు వచ్చింది. సుమారు 19 వేల టన్నుల వరకు దిగుబడి పెరిగే పరిస్థితులు ఉన్నాయి. కాపు అధికంగా ఉండడంతో గిరిజన రైతులంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఈసారి దిగుబడి ఎక్కువగా ఉండొచ్చు
ఈసారి కాఫీ తోటలకు అధిక వర్షాలు ఎంతో మేలుచేశాయి. గింజ దశ ముందుగానే రావడంతో పాటు కాపు కూడా అధికంగానే ఉంది. ఈ ఏడాది కొత్త తోటలకు కూడా తొలిసారిగా కాపు వచ్చింది. గత ఏడాది కన్నా దిగుబడి అధికంగా ఉండొచ్చని భావిస్తున్నాం. –పాలికి లక్కు, కాఫీ రైతుల సంక్షేమ సంఘం, పాడేరు
బాగా ముందుగానే కాపు
జూన్లోనే కాఫీ మొక్కలకు పిందె ఏర్పడటం తొలిసారిగా చూస్తున్నాం. సాధారణంగా ఆగస్టులో గింజ దశ ఏర్పడేది. అయితే, ఈ ఏడాది కాఫీ పూలు కూడా ముందుగానే వికసించాయి. అధిక వర్షాలు కాఫీతోటలకు మేలుచేశాయి. దిగుబడి, ధర బాగుంటే మేలు జరుగుతుంది. – గోరపల్లి నారాయణమ్మ, మహిళా కాఫీ రైతు, బరిసింగి, పాడేరు మండలం