Andhra Pradesh: ప్రతి జిల్లాలో విమానాశ్రయం

CM YS Jaganmohan Reddy review on airports ports and fishing harbors - Sakshi

వన్‌ డిస్ట్రిక్ట్‌.. వన్‌ ఎయిర్‌పోర్టు..

ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించండి

ఎయిర్‌పోర్టులు, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌       

ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం అన్ని జిల్లాల్లో ఏకరీతిగా ఉండాలి

ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టండి

బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండ్‌ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలి

ప్రస్తుతం ఉన్న వాటి విస్తరణ, రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టండి

9 ఫిషింగ్‌ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోండి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం ఉండాలన్నది మంచి భావన (కాన్సెఫ్ట్‌) అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘వన్‌ డిస్ట్రిక్ట్‌.. వన్‌ ఎయిర్‌పోర్ట్‌’కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఓడరేవులు, ఫిషింగ్‌ హార్బర్లు, విమానాశ్రయాల నిర్మాణంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి, వైఎస్సార్‌ కడప, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలులో విమానాశ్రయాలు నిర్వహణలో ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని, బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండ్‌ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని సూచించారు. 

ప్రాధాన్యత క్రమంలో పనులు
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆరు విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు.. రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలని, ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలన్నారు. నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని చెప్పారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. నిర్ణీత కాల వ్యవధిలోగా పెండింగ్‌ సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రద్దీకి తగినట్లుగా మౌలిక సదుపాయాల కల్పన, విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
 
అక్టోబర్‌కు 4 ఫిషింగ్‌ హార్బర్ల పనులు పూర్తి
రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్‌ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టాలని, పనులు వేగవంతం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. 9 ఫిషింగ్‌ హార్బర్లకు గాను తొలి దశలో నిర్మాణం చేపడుతున్న ఉప్పాడ (తూర్పుగోదావరి), నిజాంపట్నం (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా), జువ్వలదిన్నె (నెల్లూరు)ల్లో ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అక్టోబర్‌కు పూర్తవుతాయని వివరించారు. రెండో విడతలో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమగోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) జిల్లాల్లో చేపడుతున్న హార్బర్ల నిర్మాణాన్ని నిర్ధిష్ట కాల పరిమితిలోగా పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలో వీటికి టెండర్లు ఖరారు చేస్తామన్నారు.   

– ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్, సీఎఫ్‌ఎస్‌ఎస్‌ సీఈఓ రవిసుభాష్, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్, ఏపీ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సలహాదారు వీఎన్‌ భరత్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top