సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శుక్రవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీతారాములకు ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే భాగ్యానికి భక్తజనం నోచుకోలేదు. ఈసారి లక్షలాదిమంది భక్తుల సమక్షంలో భారీ ఎత్తున కల్యాణోత్సవం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు జరగనున్న జగనానందకారకుడి జగత్కల్యాణానికి మిథిలా మండపం ముస్తాబైంది.
గరుడవాహనంపై శ్రీరామచంద్రుడు
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు గురువారం ఉదయం మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన కోదండరాముడు రాత్రి 8 నుంచి 9:30 గంటల వరకు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్సేవ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం కోదండరాముడు శివధనుర్భంగాలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు.
సంబంధిత వార్తలు